ఇప్పటిదాకా టీ20 కప్ గెలిచిన జట్లు ఇవే..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్.. ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టైటిల్ కోసం తలపడనున్నాయి. 2007లో ఆరంభమైన ఈ టోర్నమెంట్లో ఇప్పటిదాకా భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు ఛాంపియన్గా నిలిచాయి. వెస్టిండీస్ రెండుసార్లు ఈ పొట్టి ఫార్మట్ విజేతగా ఆవిర్భవించింది.
ఎవరు గెలిచినా కొత్తే..
రెండు కొత్త జట్లు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరడం ఓ సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిందనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమౌతోంది. ఈ సారి టీమిండియా సెమీ ఫైనల్స్కు చేరుకోలేకపోవడం నిరాశ పరిచినప్పటికీ.. పెద్దగా బాధపడట్లేదు. దీనికి కారణం- దాయాది టీమ్ పాకిస్తాన్ సెమీ ఫైనల్స్లో తిరుగుముఖం పట్టడం. పాకిస్తాన్ ఇంటిదారి పట్టడాన్ని పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు చాలామంది ఉన్నారు.
ఫైనల్స్లో కివీస్ వైపు..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్స్లో న్యూజిలాండ్ గెలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటోన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి- కేన్ విలియమ్సన్. 2019 నాటి వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్లో ఓడిపోయిన సమయంలో కేన్ విలియమ్సన్ చూపిన స్పోర్టివ్నెస్.. భారత్లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించింది పెట్టింది. అతని క్రీడాస్ఫూర్తి పట్ల ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్గా రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్కూ మరింత చేరువ అయ్యాడు కేన్ విలియమ్సన్. కేన్ మామగా పిలుచుకుంటారు అతణ్ని. అందుకే- ఈ ఫైనల్స్లో అతను సారథ్యాన్ని వహిస్తోన్న న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటోన్నారు.
2015లో ప్రపంచకప్ ఫైనలిస్టులు..
ఈ రెండు జట్లు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన టోర్నమెంట్లలో ఫైనల్స్కు చేరడం ఇది రెండోసారి. ఇదివరకు 2015లో నిర్వహించిన ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. నాటి మ్యాచ్లో ఆసీస్ గెలిచింది. ప్రపంచకప్ను ఎగరేసుకెళ్లింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు బ్లాక్ క్యాప్స్. 2019 నాటి ప్రపంచకప్లో తనను ఓడించిన ఇంగ్లాండ్ జట్టుపై ప్రతీకారాన్ని తీర్చుకుంది కూడా. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. ఇక- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆసీస్ను చిత్తు చేయాలనే లక్ష్యంతో ఉంది.


Click it and Unblock the Notifications












