IND vs PAK Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా దాయాది పాకిస్థాన్పై భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో అభిమానులు గంగా మాతకు ప్రత్యేక హారతి ఇచ్చి.. టీమిండియా గెలుపు కోసం ఆశీస్సులు కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలోన రాజేంద్ర ప్రసాద్ ఘాట్లో జరిగిన గంగా హారతిలో అభిమానులు త్రివర్ణ పతాకాలను, భారత క్రికెటర్ల చిత్రాలను చేతుల్లో పట్టుకుని కనిపించారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు ముందు ఇలాంటి పూజలు, ప్రార్థనలు సాధారణమే.
యుద్ధంలో అయినా, ఆటలో అయినా భారత్దే పైచేయి
క్రికెట్ అభిమాని రాజేష్ శుక్లా మాట్లాడుతూ.. "ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అది యుద్ధరంగం అయినా, ఆట మైదానం అయినా, భారత్ ఎల్లప్పుడూ పాకిస్థాన్ను ఓడించింది. టీమిండియా ఈ మ్యాచ్ను కూడా గెలుస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే గంగా మాతకు ప్రత్యేక పూజలు చేసి, శివుడిని భారత్ విజయానికి ప్రార్థించాం" అని అన్నారు.

లక్నోలో ప్రత్యేక పూజలు
ఆసియా కప్ 2025లో ఈరోజు జరగనున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలని కోరుతూ లక్నోలో ప్రత్యేక హవనం, పూజలు నిర్వహించారు.మ్యాచ్కు ముందు నిర్వహించిన హవనంలో, వారు ప్రత్యేక పూజలు చేసి, టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, పాకిస్తాన్ను ఓడించాలని కోరారు. ఆసియా కప్లో రెండు జట్ల మధ్య ఉత్కంఠమైన పోటీ నెలకొనగా.. లక్నోలోని ఈ పూజలు భారత ప్రజలలో క్రికెట్కు ఉన్న మక్కువను, తమ జట్టుపై ఉన్న అపారమైన విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పాయి.
ప్రయాగ్రాజ్లో ప్రత్యేక ప్రార్థనలు
భారత్ విజయం సాధించాలని కోరుతూ ప్రయాగ్రాజ్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈరోజు జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్కు ముందు, అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించి, టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరచాలని దైవాన్ని వేడుకున్నారు.
కర్ణాటకలోనూ అదే నమ్మకం
కర్ణాటకలోని బెలగావిలో ఉన్న అభిమానులు కూడా భారత్ గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై నమ్మకం ఉంచారు. ఓ అభిమాని మాట్లాడుతూ.. "భారత్ ఈ మ్యాచ్ను గెలుస్తుంది. మాకు కెప్టెన్ సూర్యపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ టైటిల్ను భారతే గెలుచుకుంటుంది" అని చెప్పారు.
ఆసియా కప్లో టీమిండియా జోరు
ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ప్రారంభించింది. యూఏఈతో జరిగిన తమ మొదటి మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి మ్యాచ్లో ఒమన్ను 93 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. టీ20 ఫార్మాట్ ఆసియా కప్లో పాకిస్థాన్పై ఇండియాకు మంచి రికార్డు ఉంది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల చేతిలో మాత్రమే భారత్ ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఫైనల్కు చేరుకుంటే, ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్తో ఈ మెగా టోర్నమెంట్ మరింత ఉత్కంఠగా మారనుంది.