
హైదరాబాద్: గత రెండేళ్లుగా మంచి విజయాలను సాధిస్తూ దూకుడు మీదున్న భారత జట్టు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది. పాకిస్తాన్, న్యూజిలాండ్పై వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. రెండు దారుణమైన పరాజయాలతో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 నుంచే భారత్ ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు టీమిండియాతో బరిలోకి దిగాలంటే ప్రత్యర్థి జట్లు భయపడే పరస్థితి ఉండేది. కానీ తాజాగా పాక్, న్యూజిలాండ్ జట్లు అలవోక విజయాలు ఇండియన్ క్రికెట్ లవర్స్ను నిరాశకు గురి చేశాయి. వరుస ఓటములను తట్టుకోలేని అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
భారత అభిమానులు భారత్ ఓటమిని తట్టుకోలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని మ్యాచ్ అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ తన మనసులో ఉన్న భాధను తెలిపాడు. 'ఈరోజు మ్యాచ్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. గర్వంగా ఎప్పుడూ ఫీల్ కావొద్దు. బీసీసీఐ, ఐపీఎల్.. ముందుగా కామ్ డౌన్ కాండి. మీరు దేవుడు కాదు. ఇది అసలు నిజం. మీరు ఐపీఎల్ కోసం ఆడట్లేదు.. భారత దేశం కోసం ఆడుతన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రంపంచంలోనే ధనిక బోర్డు అయినా.. ఐపీఎల్ కోసం ఆడట్లేదు. దేశం కోసం ఆడుతున్నారు. టీమిండియా కోసం ఆలోచించండి. ఇదంతా బుల్ షిట్' అని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. లోకేశ్ రాహుల్ (18), ఇషాన్ కిషన్ (4), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (12) పూర్తిగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, సోధీ రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డారిల్ మిషెల్ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.
సూపర్-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన కోహ్లీసేన పట్టికలో నమీబియా కంటే కింద ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ మూడు విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. కివీస్ కూడా ఆఫ్ఘనిస్తాన్, నమీబియాలపై గెలిస్తే సెమీస్ చేరనుంది.ఇక భారత్ నాకౌట్కు అర్హత సాధించాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గడంతో పాటు అనేక సమీకరణాలు అనుకూలించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా జరగని పనే అని చెప్పాలి.