
టీమిండియా యువ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ సరికొత్త అవతారమెత్తారు. నిత్యం క్రికెట్తో బిజీగా ఉండే ఈ ఆటగాళ్లు కాసేపు సింగర్ అవతారమెత్తారు. పలు బాలీవుడ్ పాటలను ఆలపించారు. లక్నో వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో గెలిచి జోష్ మీదున్న టీమిండియా రెండో టీ20 మ్యాచ్ కోసం ధర్మశాలకు బయలుదేరింది. ఇందుకోసం స్టేడియం నుంచి బస్సులో ఎయిర్పోర్టుకు వెళ్లే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు తమ గాన ప్రతిభను బయటికి తెచ్చారు.
హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బాలీవుడ్ పాటలను ఆలపించారు. పాటలు పాడుతూ సరదాగా గడిపారు. వీరి పాటలతో టీమిండియా బస్సు ప్రయాణం సందడిగా మారింది. దీనికి సంబంధించిన 55 సెకన్ల వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. టీమిండియా ఆటగాళ్లు క్రికెటే కాదు, పాటలు కూడా పాడగలమని నిరూపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక రెండో టీ20 మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది.
తుది జట్లు
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.