హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం బెంగళూరులో మొదలైంది. మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. మొత్తం 76 మందిని ఈ వేలంలో కొనుగోలు చేయనున్నారు. మధ్యాహ్నాం లంచ్ విరామం సమయానికి మొత్తం 33 మంది ఆటగాళ్లను వివిధ ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
అయితే ఐపీఎల్ 10వ ఎడిషన్ కోసం జరుగుతున్న వేలం పాటలో భారత క్రికెటర్లకు చేదు అనుభవమే ఎదురైంది. సోమవారం ఇప్పటివరకు జరిగిన వేలంపాటలో విదేశీ ఆటగాళ్లకు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోగా.. భారత క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపడం లేదు.

టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఏ ప్రాంఛైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. మరో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ను సైతం కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. పఠాన్ కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించినా ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

ఇలానే టీమిండియా ఆటగాళ్లు ప్రజ్ఞాన్ ఓజా, ఉన్ముక్త్ చంద్, పృథ్వీషా, రాహుల్ శర్మలను కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఇటీవలే టీ20లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మోహిత్ను సైతం ప్రాంచైజీలు మొండిచెయ్యి చూపించారు. ఆయా క్రికెటర్లను కొనేందుకు ఇప్పటివరకు ఏ ఒక్క ఫ్రాంచేజీ కూడా ముందుకు రాలేదు.

ఇక పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు కూడా ఈసారి వేలంలో నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ క్రికెటర్లు రాస్ టేలర్, మార్టిన్ గఫ్తిల్, ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్లకు ఆశాభంగం తప్పలేదు. బ్రాడ్ హాగ్ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లెచర్ (వెస్టిండీస్)లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచేజీలు ఆసక్తి చూపక పోవడం విశేషం.