
ముంబై: దేశవ్యాప్తంగా సోమవారం నుంచే గణేష్ చతుర్థి సంబరాలు మొదలయ్యాయి. మంటపాల్లో కొలువైన గణనాథులను ప్రజలు భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ముంబై నగరంలో ప్రతీ గల్లీ గణనాథుని నామస్మరణతో మారుమోగిపోతోంది. ఈక్రమంలో ముంబైలోని అంటిల్లాలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు ముఖేష్ అంబానీ ఇంట్లోనూ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఎంతో వైభవంగా ముస్తాబు చేసిన మంటపంలో అంబానీ కుటుంబ సభ్యులు గణనాథునికి విశిష్ట పూజలు జరిపించారు. ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సహా కుటుంబ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశ్ అంబానీ,శ్లోకా మెహతాల పెళ్లి తర్వాత వచ్చిన మొదటి గణేశ్ చతుర్థి కావడంతో.. అంబానీ కుటుంబం ఈ వేడుకలను మరింత ఘనంగా జరిపారు. అంబానీ పులుపు మేరకు ఈ వేడుకలకు భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ వేదికలకు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, పార్థివ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రగ్యాన్ ఓజా, అజిత్ అగార్కర్లు తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అంబానీ నివాసంలో వీరందరూ సందడి చేశారు. అక్కడ గణేష్ చతుర్థి పూజలో పాల్గొన్నారు. ఆటగాళ్లను కలుసుకోవడం సంతోషంగా ఉందని సచిన్, యువీ, హర్భజన్ అన్నారు. వీరందరూ కలిసి దిగిన పోటోలను సచిన్, యువీ, హర్భజన్ తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.