
హైదరాబాద్: ఐపీఎల్-11 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న శార్దూల్.. తల్లిదండ్రులు అనుకోని ప్రమాదానికి గురైయ్యారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ శార్దూల్ తండ్రి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పూణె నుంచి బయలుదేరి ముంబైలోని లీలావతి ఆస్పత్రికి వచ్చాడు.
ఆ వివరాలిలా.. మహారాష్ట్ర పాల్ఘడ్లోని అల్యాలిలో ఓవివాహ వేడుకకు శార్దూల్ పేరెంట్స్ నరేంద్ర ఠాకూర్, హౌన్సా హాజరయ్యారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి వారు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
వీరు వెళ్తున్న బైక్ ఒక్కసారిగా స్కిడ్ అవడంతో నరేంద్ర, హౌన్సాలు కింద పడిపోయారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనుంచి వెళ్తుండగా.. వీధి దీపాలు లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ నరేంద్రను తొలుత పాల్ఘడ్లోని డాక్టర్ ధావాలే ఛారిటబుల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సీటీ స్కాన్ అనంతరం మెరుగైన వైద్యం కోసం లీలావతి ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో క్రికెటర్ శార్దూల్ తండ్రి నరేంద్ర మెదడులో రక్తం కట్టిందని తమ ప్రయత్నం చేస్తున్నట్లు డాక్టర్లు అంటున్నారు. నరేంద్రకు ఇదివరకే రెండుసార్లు హార్ట్ సర్జరీలు అయ్యాయి. ఆయనకు బీపీ, షుగర్ కూడా ఉన్నాయి. శార్దూల్ తల్లి హౌన్సాకు స్వల్ప గాయాలు కాగా, చికిత్స అనంతరం డిశ్ఛార్జ్ చేశారు.