భారత క్రికెటర్ ధావల్ కులకర్ణి ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఈ ముంబై ప్లేయర్ భావోద్వేగంతో కంటితడి పెట్టాడు. తన చివరి మ్యాచ్లో ముంబై జట్టును కులకర్ణినే విజయతీరాలకే చేర్చడం విశేషం. కులకర్ణి వీడ్కోలుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
'ముంబై యోధుడివి.. అద్భుతమైన కెరీర్' అంటూ కులకర్ణి ఫొటోతో రోహిత్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. టీమిండియా తరఫున కులకర్ణి 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 2014 అరంగేట్రం చేసిన అతడు 2016 తర్వాత అవకాశాలు అందుకోలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో 22 వికెట్లు పడగొట్టాడు. ధావల్ కులకర్ణి 95 ఫస్ట్ క్లాస్, 130 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 281 వికెట్లు, లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 154 వికెట్లు పడగొట్టాడు.

విదర్భతో జరిగిన ఫైనల్లో ధావల్ కులకర్ణి తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ తీశాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న కులకర్ణికి.. పోరును ముగించాలని ముంబై కెప్టెన్ అజింక్య రహానె ఆఖర్లో బంతిని అందించాడు. ఉమేశ్ యాదవ్ను కులకర్ణి క్లీన్బౌల్డ్ చేసి జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అనంతరం కులకర్ణి ఎమోషనల్ అయ్యాడు.

ఫైనల్ ముగిసిన అనంతరం ధావల్ కులకర్ణి మాట్లాడాడు. ''కెరీర్ ఆరంభాన్ని, ముగింపును అత్యున్నత ముగించడం ప్రతి క్రికెటర్ కల. ముంబై తరఫున ఫైనల్ ఆడటం నాకు ఇది ఆరోసారి. అందులో అయిదు సార్లు టైటిళ్లు గెలిచాం. మ్యాచ్ను ముగించమని రహానె నాకు బంతి అందివ్వడం గొప్పగా అనిపించింది. అసలు ఊహించలేదు. ఈ విషయంలో తుషార్ దేశ్పాండేకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. తన చివరి రెండు ఓవర్లలో అతడు రెండు వికెట్లు తీసి కూడా నాకు బంతిని ఇవ్వడానికి అంగీకరించాడు'' అని కులకర్ణి పేర్కొన్నాడు.

ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరఫున ధావల్ కులకర్ణి ఆడాడు. 2021 సీజన్లో ముంబై తరఫున లీగ్కు గుడ్బై చెప్పాడు. 92 మ్యాచ్ల్లో 86 వికెట్లు పడగొట్టాడు.