హైదరాబాద్: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు ఫైనల్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్లో మెరుగైన ఆటతీరు కనబర్చిన మహిళా క్రికెటర్లకు బీసీసీఐతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు బహుమతులు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్కు చెందిన భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్కు తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి ఇవ్వగా, చాముండేశ్వరీ నాథ్ బీఎండబ్ల్యూ కారుని ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకకు చెందిన మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ను కూడా అక్కడి ప్రభుత్వం సత్కరించింది.
ఆగస్టు 15ని పురస్కరించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కర్ణాటక నీటి వనరుల మంత్రి ఎంబీ పాటిల్ రాజేశ్వరిని సత్కరించి, ఆమెకు రూ. 5 లక్షల కారుని బహుమతిగా ఇవ్వబోయారు. ఇందుకు ఆమె తనకు దక్కిన గౌరవానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ కారును సున్నితంగా తిరస్కరించింది.

అంతేకాదు ప్రస్తుతం తన కుటుంబం ఉన్న పరిస్థితుల్లో తనకు కారు అక్కర్లేదని ఇల్లు ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం తాము అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, తన తల్లి, చెల్లి, సోదరులతో కలిసి ఉండటానికి ఇల్లు కావాలని ఆమె ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది.
ఆమె ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని మంత్రి త్వరలోనే ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంతకముందు ఆటోమొబైల్ షోరూమ్ ప్రతినిధుల కోరిక మేరకు మంత్రి ఇచ్చిన ఆటో గేర్ స్కూటర్ను రాజేశ్వరి తీసుకోవడం విశేషం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేశ్వరి గైక్వాడ్ ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో భారత్ ఫైనల్ చేరడంలో తనవంతు పాత్ర పోషించింది.
టోర్నీలో తాను ఆడిన మూడు మ్యాచ్ల్లో పొదుపుగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీసింది. మొత్తం ఐదు మంది ఆడపిల్లలు సంతానంలో రాజేశ్వరి రెండో అమ్మాయి. 2014లో రాజేశ్వరి తండ్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారత్-విండిస్ మ్యాచ్ చూసేందుకు వెళ్లి స్టేడియంలోనే గుండెపోటుతో చనిపోయాడు.
అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను రాజేశ్వరే మోస్తోంది. తన కూతురు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్నా.. తాము బెంగళూరులో ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటూ.. ఉపాధి కోసం తరచూ వివిధ ప్రాంతాలకి మారాల్సి వస్తోందని రాజేశ్వరి తల్లి సవిత కన్నీరు పెట్టుకుంటోంది.