Nitish Rana: భారత స్టార్ క్రికెటర్ నితీష్ రాణా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన భార్య సాచి మార్వా ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తలను నితీష్ రాణా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భారత క్రికెట్ జట్టుకు 3 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన నితీష్ రాణా.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. నితీష్ రాణా, సాచి మార్వాలు ఇద్దరు పోస్టును షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. జూన్ 16న సాచి కవల మగపిల్లలకు జన్మనిచ్చినట్లు వారు పేర్కొన్నారు. దీనితో పాటు వారు పిల్లల చేతుల ఫోటోను కూడా పంచుకున్నారు. నితీష్ రాణా ఫిబ్రవరి 18, 2019న సాచిని వివాహం చేసుకున్నాడు. సాచి మార్వా ఒక ఇంటీరియర్ డిజైనర్, ప్రముఖ హాస్యనటుడు అభిషేక్ కృష్ణకు సోదరి.
అభినందనలు తెలిపిన క్రీడాకారులు, స్నేహితులు
రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ నూతన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. "మా చిట్టి ఆనందాల రాకకు అభినందనలు. ప్రతి బిడ్డ కోరుకునే అత్తయ్యను అవుతానని నేను వాగ్దానం చేస్తున్నాను" అని రాసుకొచ్చింది. వెంకటేష్ అయ్యర్, పీయూష్ చావ్లా, రాహుల్ తెవాటియా, రమణ్దీప్ సింగ్ వంటి ఇతర క్రికెటర్లు కూడా నితీష్కు తండ్రి అయినందుకు అభినందనలు తెలిపారు.

నితీష్ రాణా క్రికెట్ కెరీర్
2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నితీష్ రాణా కేవలం ఒక వన్డే, 2 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ 3 మ్యాచ్లను అతను జులైలో శ్రీలంకతో ఆడాడు. ఒక వన్డేలో 7 పరుగులు, 2 టీ20 ఇన్నింగ్స్లలో 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీష్ రాణా ఎటువంటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. నితీష్ రాణా 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 2954 పరుగులు, 78 లిస్ట్ ఏ మ్యాచ్లలో 2281 పరుగులు చేశాడు. ఐపీఎల్లో నితీష్ రాణా 3 వేర్వేరు జట్ల తరఫున మొత్తం 118 మ్యాచ్లు ఆడాడు.
నితీష్ తన ఐపీఎల్ కెరీర్ను 2016లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ ప్రారంభించాడు. ముంబై ఇండియన్స్ తరఫున 2 సీజన్లు ఆడిన తర్వాత, అతను 7 సీజన్లు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడాడు. 2025కు ముందు కేకేఆర్ అతన్ని విడుదల చేయగా, ఆ తర్వాత అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రాజస్థాన్ తరఫున ఆడిన 11 మ్యాచ్లలో నితీష్ రాణా 217 పరుగులు చేశాడు, ఇందులో 2 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్లు ఉన్నాయి.