
హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దాదాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో గంగూలీ ఎన్నికపై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన ట్విట్టర్లో "బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవబోతున్న గంగూలీకి కంగ్రాట్స్. మీ నేతృత్వంలో భారత క్రికెట్ మరింత వృద్ధి చెందుతుందని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు. కొత్త పాత్రలో మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.
వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్కు గంగూలీ "థాంక్స్ వీవీఎస్... నీ సాహాకారం కూడా ఎంతో ముఖ్యం" అని రీట్వీట్ చేశాడు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ కారణంగా సెప్టెంబర్ 2020 వరకు దాదా ఈ పదవిలో సౌరవ్ గంగూలీ కొనసాగనున్నాడు. గంగూలీ నామినేషన్ సందర్భంగా అతడి వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లాలు ఉన్నారు.
"బీసీసీఐలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరికొన్ని నెలల్లో అన్ని వ్యవస్థలు ప్రక్షాళన చేసి.. మళ్లీ భారత క్రికెట్కు పూర్వవైభవం తీసుకొస్తాం. ఏకపక్షంగా గెలవడం ముఖ్యం కాదు అని, ప్రపంచ క్రికెట్లోనే బీసీసీఐ అతిపెద్ద సంస్థ అని, దాని బాధ్యతలు చూసుకోవడం ముఖ్యం. ఆర్థికపరంగా బీసీసీఐ కీలకమైంది, అలాంటి సంస్థకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం సవాలే" అని గంగూలీ పేర్కొన్నాడు