న్యూఢిల్లీ: భార్యలను, గర్ల్ ఫ్రెండ్ను అనుమతించినందు వల్ల ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటనకు జాగ్రత్త పడింది. ఈ పర్యటనకు క్రికెటర్ల వెంట భార్యను లేదా ప్రేయసిని అనుమతించరాదని బీసీసీఐ నిర్ణయించింది.
దీంతో క్రికెటర్లు తోడు లేకుండానే ఆస్ట్రేలియా బయలుదేరారు. ఇంగ్లాండ్ పర్యటనకు క్రికెటర్ల వెంట భార్యలతో పాటు విరాట్ కోహ్లీకి తోడుగా అతడి ప్రేయసి అనుష్క శర్మను అనుమతించడం విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కోహ్లీ ఆ సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు.

దీనికి అనుష్క శర్మనే కారణమని చాలామంది అభిప్రాయపడ్డారు. క్రికెటర్లకు మ్యాచ్ల మధ్య ఖాళీ దొరికినప్పుడు భార్యలతో గడపడం పైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ప్రాక్టీస్కు ఎక్కువ సమయం కేటాయించడం లేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి బోర్డు మనసు మార్చుకున్నదని భావిస్తున్నారు.
కొత్తగా పెళ్లైన రహానేతో పాటు ఛటేశ్వర పుజారా, ఉమేష్ యాదవ్, షమి, మురళీ విజయ్, అశ్విన్ తదితరులు తమ వెంట భార్యను తీసుకు వెళ్తామని కోరితే, బోర్డు స్పందించలేదట. అయితే, భవిష్యత్తులో భార్యలను అనుమతించే విషయమై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కొన్ని షరతులతో ముందుముందు ఒప్పుకోవచ్చునని అంటున్నారు.