ముంబైలో జట్టు ప్రకటన:
బీసీసీఐ సెలక్షన్ కమిటీ వరల్డ్కప్ కోసం టీమిండియా జట్టును ఏప్రిల్ 15న ప్రకటించనుంది. ముంబైలో జరిగే సమావేశం అనంతరం 15 మంది సభ్యులతో కూడిన జట్టును కమిటీ ప్రకటించనుంది. ఐపీఎల్-12 ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకోని జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే ఆ రోజు ముఖ్యంగా నాలుగో స్థానంపై చర్చ జరగనుంది. ఆల్రౌండర్, అదనపు స్పిన్నర్/ పేసర్ అంశాలపై కూడా సెలెక్టర్లు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జూన్ 5న సౌతాఫ్రికాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అన్నికంటే ముందుగా ప్రపంచకప్లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టును ఆదేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్ బోర్డు ప్రకటించింది.
నాలుగో స్థానంపై చర్చ:
భారత జట్టులో నాలుగో స్థానంపై చర్చ ఎప్పటినుండో జరుగుతోంది. 2019 ప్రపంచకప్లో ఎవరీ స్థానాన్ని భర్తీ చేయనున్నారో తెలియడం లేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఎంతో మంది ఆటగాళ్లను పరీక్షించినా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే ఆ స్థానంపై అంబటి రాయుడును తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా సిరీస్, ప్రస్తుత ఐపీఎల్ సీజన్-12లో పరుగులు చేయడంలో రాయుడు విఫలమయ్యాడు. దీంతో లోకేష్ రాహుల్, అంజిక్య రహానేలు రాయుడికి పోటీగా నిలిచారు. అయితే మూడో ఓపెనర్గా రాహుల్ కచ్చితంగా స్థానం పొందే అవకాశం కూడా ఉంది.
పంత్/కార్తీక్:
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి బదులుగా సీనియర్ దినేశ్ కార్తిక్ను జట్టులోకి తీసుకోవాలని కొందరు మాజీలు సూచిస్తుంటే.. మరికొందరు రిషబ్ పంత్కే అవకాశం అవ్వాలని అంటున్నారు. ఈ మధ్య కాలంలో కార్తీక్ వచ్చిన అవకాశాలను ఉంపయోగించుకుంటూ టీంఇండియాకు మంచి విజయాలు అందిస్తున్నాడు. మరోవైపు పంత్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సెలెక్టర్లు మాత్రం పంత్కే ఓటువేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అవకాశం ఎవరిని వరిస్తుందో మరి.
మూడో స్పిన్నర్/నాలుగో పేసర్:
జట్టులో ఇప్పటికే ముగ్గురు పేసర్లు (జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ), ఇద్దరు స్పిన్నర్లు ( కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్) ఉన్నారు. ఇంగ్లాండ్ పిచ్ లు కాబట్టి నాలుగో పేసర్ అవసరం అనుకుంటే ఖలీల్ అహ్మద్.. మరో ఆల్ రౌండర్ కావాలనుకుంటే రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశం ఉంది. ఈ స్థానంపై కూడా ఇప్పటికీ ఎలాంటి లీకులు లేకపోవడంతో చర్చనీయాంశం అయింది.
జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్/రిషబ్ పంత్, ఖలీల్ అహ్మద్/జడేజా.