
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా సోకగా.. దాదాపు లక్ష మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి దెబ్బకు క్రీడాలోకం స్తంభించిపోయింది. ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్ ఇలా అన్ని రకాల ఆటలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎక్కడ కూడా లైవ్ మ్యాచ్లు జరగకపోవడంతో స్పోర్ట్స్ ఛానెల్లలో భారీ స్థాయిలో వ్యూయర్షిప్ తగ్గిపోయింది.
అయితే వ్యూయర్షిప్ కోసం స్పోర్ట్స్ ఛానెల్లు ఐసీసీ ప్రపంచకప్, డబ్ల్యుడబ్ల్యుఈ లాంటి పాత మ్యాచ్లను తిరిగి ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ వ్యూహం స్పోర్ట్స్ ఛానెల్లకు పనికొచ్చిందట. ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్లు, ఇతర క్రీడా కార్యక్రమాలు లేనప్పటికీ పాత మ్యాచ్లను తిరిగి ప్రసారం చేయడం ద్వారా 12వ వారంతో పోలిస్తే.. 13వ వారంలో 21% వ్యూయర్షిప్ పెరిగిందని బార్క్-నీల్సన్ నివేదిక ఓ ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్ 1న డబ్ల్యుడబ్ల్యుఈ బ్లాక్ బస్టర్స్ ప్రారంభమైంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2011లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రసారం చేయగా.. వ్యూయర్షిప్ (వీక్షకుల నిమిషాలు)లో 87% వృద్ధిని నమోదు చేసిందట. దాయాదుల మధ్య పోరు అంటే ఇలానే ఉంటుంది మరి. శ్రీలంక-భారత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను బుధవారం, గురువారం, శుక్రవారంలో వరుసగా 23%, 52%, 9% వ్యూయర్షిప్ పెరిగిందట.
బార్క్-నీల్సన్ నివేదిక ప్రకారం 13వ వారంలో స్టార్ స్పోర్ట్స్-1 నంబర్ వన్ ఛానల్గా కొనసాగింది. స్టార్ స్పోర్ట్స్-1 74401 వ్యూయర్షిప్ సంబంధించింది. స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ (66504) రెండవ స్థానంలో, సోనీ టెన్ 1 మూడవ స్థానంలో (50625) ఉన్నాయి. సోనీ టెన్ 3 (32940 ) మరియు స్టార్ స్పోర్ట్స్ 2 (23034 ) వరుసగా నాలుగు, ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటిదగ్గరే ఉంటున్న ప్రజల కోసం ఇప్పటికే దూరదర్శన్ పలు పాత ప్రోగ్రామ్లు తిరిగి టెలికాస్ట్ చేస్తున్నాయి. క్రికెట్ అభిమానులకు బీసీసీఐ కూడా గుడ్న్యూస్ చెప్పింది. లాక్డౌన్ సమయం ఇంకా ఉండటంతో బోర్ కొట్టకుండా ఉండేందుకు టీమిండియా ఆడిన పాత మ్యాచులను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ప్రతిరోజు.. మూడు మ్యాచుల హైలెట్స్ టెలికాస్ట్ చేస్తామని పేర్కొంది. వీటిని డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో వీక్షించవచ్చని తెలిపింది.