
హైదరాబాద్: భారత్ నేడు 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రజలు జెండాలు ఎగురువేస్తూ జాతీయ భావాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యుజువేంద్ర చహల్, సురేశ్ రైనా, రిషభ్ పంత్ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పారు. ఎవరెవరు ఏమన్నారో ఓసారి చూద్దాం.
దేశానికి బలమవుదాం అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. 'మనం ఈ రోజు ఏం చేస్తున్నామన్న దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన దేశానిని మనం బలమవుదాం. మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరడానికి సాయం చేద్దాం. ప్రతి ఒక్కరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, జైహింద్' అని విరాట్ ట్వీట్ చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే అని ట్వీట్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ టెస్ట్ గెలిచిన తర్వాత త్రివర్ణ పతాకం పట్టుకొని గ్రౌండ్లో తిరుగుతున్న టీమిండియా ఫొటోను షేర్ చేశాడు.
'భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. నేనెక్కడ ఉన్నా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూస్తే.. నా గుండెలో గర్వం ఉప్పొంగుతుంది. మనమంతా ఈ దేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి' అని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
'భారత్ అంటే ప్రేమ, గర్వం, ఇష్టం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' అని స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు.
'అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత దేశం పాటిస్తున్న విలువలు.. మనకు మార్గనిర్దేశం చూపే కాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీటాడు.
'ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్. ఈ కఠిన సమయంలో మనమందరం తోటివారికి అండగా నిలుద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే' మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా పేర్కొన్నాడు.
'సగర్వంగా మువ్వన్నెల జెండాను పట్టుకోవడానికి మించి క్రీడాకారులకు ఏదీ ఎక్కువ కాదు. ఈ గణతంత్ర దినోత్సవం రోజు మన గొప్ప దేశం గురించి సెలబ్రేట్ చేసుకోవాల్సింది చాలా ఉంది. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు' అని మాజీ బ్యాట్స్మన్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.
'అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేడుకలు జరుపుకొన్నాక ఎవరూ జాతీయ జెండాలను రోడ్లపై పడేయొద్దని నా విజ్ఞప్తి' అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
'మనం ఈ దేశ బిడ్డలం. అందుకు గర్వపడుతున్నాం. మూడు రంగుల జెండా మా దేశ గుర్తింపు. అదే మా హిందూస్థాన్. దేశభక్తుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం లభించింది. ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' అని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.
'ప్రజల గొంతుకలో పరమాత్ముని స్వరం దాగి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జై హింద్' అంటూ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ట్వీటాడు.