
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. వీరి పోరాటం కారణంగా మూడో టెస్ట్ డ్రా అయ్యింది. చివరి రోజు ఆటలో విహారి, అశ్విన్ చూపించిన తెగువ అసమానం. వీళ్ల పట్టుదల అసాధారణం. తొడ కండరాలు పట్టేసి సరిగ్గా నడవలేని స్థితిలో విహారి.. అయితేనేం జట్టును ఓటమి నుంచి కాపాడాలనే అతని తపన ముందు ఆ గాయం చిన్నదైపోయింది. అశ్విన్ ముందు రోజు రాత్రి వెన్నునొప్పితో బాధపడి.. ఉదయం పూట బూట్లు వేసుకోవడానికి కూడా వంగలేకపోయాడు. కానీ జట్టును రక్షించాలనే ధ్యేయం ముందు ఆ నొప్పి పారిపోయింది.
అయిదో రోజు ఆటలో అప్పటికే గొప్ప బ్యాటింగ్తో జట్టును విజయం దిశగా నడిపించాలని ప్రయత్నించిన రిషబ్ పంత్, చేటేశ్వర్ పుజారా స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. కొత్త బంతితో ఆసీస్ పేసర్లు వికెట్లు పడగొట్టాలనే ఆత్రుతతో ఉన్నారు. మ్యాచ్ను డ్రాగా ముగించాలంటే భారత్ సుమారు 40 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. క్రీజులో విహారి, అశ్విన్ ఉన్నారు. ఈ సిరీస్లో విహారి ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. తొలి రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్ల్లోనూ వరుసగా 16, 8, 21 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే అతని తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతను క్రీజులో నిలవగలడా? అనే సందేహం కలిగింది. అశ్విన్కు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ అతనిలో నిలకడ లేదు. ఇన్ని సవాళ్ల మధ్య వీళ్లు అమోఘంగా బ్యాటింగ్ చేశారు.
పరుగులు తీయడం కష్టమైనప్పటికీ క్రీజులో నిలబడిన విహారి ఓవర్లను కరిగిస్తూ వెళ్లాడు. సిడ్నీ మైదానంలో మంచి బ్యాటింగ్ రికార్డు ఉన్న అశ్విన్ కూడా అదే చేశాడు. చూస్తుండగానే ఓవర్లు కరిగిపోతూ వచ్చాయి. వికెట్లు పడకపోవడంతో ఆసీస్ ఆటగాళ్లలో ఆందోళన పెరిగింది. ఎలాగైనా సరే ఈ జోడీని విడదీయాలని మాటలతో కవ్వించారు.. చేతలతో ఏకాగ్రత దెబ్బతీయాలని చూశారు.. షార్ట్ పిచ్ బంతులతో భయపెట్టారు. కానీ ప్రత్యర్థి ప్రయత్నాలన్నింటినీ ఈ ఇద్దరూ చిత్తుచేశారు. చివరకు జట్టును ఆదుకుని హీరోలు అయ్యారు.
సిడ్నీ టెస్ట్ డ్రా తర్వాత విహారి, అశ్విన్లను టీమిండియా ఆటగాళ్లు మైదానంలోకి వెళ్లి హత్తుకుని అభినందించారు. ముందుగా కెప్టెన్ అజింక్య రహానే వెళ్లి విహారిని, ఆపై అశ్విన్ను హత్తుకున్నాడు. అనంతరం జట్టు సభ్యులు అభినందించారు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఇద్దరిని భారత బృందం ప్రశంసించారు. ఇండియన్ క్రికెట్ టీమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్.. డ్రెస్సింగ్ రూమ్లో మ్యాచ్ తర్వాత తీసిన వీడియోను పోస్ట్ చేసింది. 'టీమిండియాకు సుదీర్ఘ కాలం గుర్తిండిపోయే క్షణాలివి' అంటూ వీడియోను షేర్ చేసింది. క్రికెట్.కామ్.ఏయూ కూడా తన ట్విటర్ హ్యాండిల్లో మ్యాచ్ తర్వాతి వీడియోను పోస్ట్ చేసింది.