మొహాలి: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకుల్లో కోహ్లీ మూడో స్ధానానికి ఎగబాకాడు.
ఇటీవలే కోహ్లీ తన టెస్టు క్రికెట్ కెరీర్లోనే నాలుగో స్ధానంలో నిలిచి అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు. అయితే తాజాగా ఇంగ్లాండ్తో మొహాలిలో మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మరో స్ధానానికి ఎగబాకి మూడో స్ధానంలో నిలిచాడు. మొహాలి వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మొహాలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులు చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో టెస్టు ర్యాంకుల్లో 833 పాయింట్లతో కోహ్లీ మూడో స్ధానంలో నిలిచాడు. రెండో స్ధానంలో నిలిచిన జో రూట్ని సమం చేయాలంటే కోహ్లీకి ఇంకా 14 పాయింట్లు కావాల్సి ఉంది.

ఇక టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20ల్లో కోహ్లీ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుండగా, వన్డేల్లో మాత్రం రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరిస్లో కోహ్లీ ఇప్పటివరకు 405 పరుగులు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ఛటేశ్వర పుజారా ఒక స్ధానం ఎగబాకి 8వ స్ధానంలో నిలిచాడు.
ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టో 9వ స్ధానంలో నిలిచి కెరీర్లోనే అత్యున్నత స్ధానాన్ని అందుకున్నాడు. నవంబర్ 30, 2016 నాటికి టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ టెన్ స్ధానాల్లో ఉన్న వారు వీరే:
1. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 897 rating points
2. జో రూట్ (ఇంగ్లాండ్) - 847
3. విరాట్ కోహ్లీ (ఇండియా) - 833
4. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) - 817
5. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా) - 791
6. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) - 778
7. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 772
8. చెతేశ్వర్ పుజారా (ఇండియా) - 760
9. జానీ బెయిర్స్టో (ఇంగ్లాండ్) - 759
10. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్) - 753