హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా విజయానికి బౌలర్ల అద్భుత ప్రదర్శనే కారణమని టీమిండియా వెటరన్ స్ఫిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడం బౌలర్ల ప్రతిభకు నిదర్శనమని భజ్జీ ఐసీసీకి రాసిన కాలమ్లో కొనియాడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
పేసర్లు తొలి 10 ఓవర్లలో ఎక్కువ డాట్ బాల్స్ వేశారని దీంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ కాస్తంత ఒత్తిడికి గురయ్యారని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఈ క్రెడిట్ అంతా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రాదేనని, ఫీల్డింగ్, బౌలింగ్తో అద్భుతంగా రాణించాడని పొగడ్తలతో ముంచెత్తాడు.

మరో పేసర్ భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారని భజ్జీ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటింగ్కు 10/10 రేటింగ్ ఇచ్చాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ధావన్, కోహ్లీలు అద్భుత ప్రదర్శన చేశారని తెలిపాడు. చేధనలో కోహ్లీ సేన రాణిస్తుందనే విషయం మరోసారి నిరూపితమైందని భజ్జీ తెలిపాడు.
విరాట్ కోహ్లి, డివిలియర్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు చెందినవారని, కానీ వారి ఆటలోని దృక్పథం వేరువేరని భజ్జీ అభిప్రాయపడ్డాడు. మైదానంలో కోహ్లీ సానుకూల దృక్పథంతో కనిపిస్తాడని, డివిలియర్స్లో అది కనిపించదని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇది కూడా టీమిండియా గెలుపుకు ఒక కారణమని తెలిపాడు.
దక్షిణాఫ్రికా చేసిన చిన్న చిన్న తప్పిదాలే వారి కొంపముంచిందని భజ్జీ పేర్కొన్నాడు. ఒక ఇన్నింగ్స్లో మూడు రనౌట్లు కావడం చాల అరుదని అలాంటిది డివిలియర్స్, మిల్లర్ రనౌట్లు టీమిండియాకు బూస్టింగ్ ఇచ్చిందని భజ్జీ పేర్కొన్నాడు. నిజానికి దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఊహించలేదని, కానీ నా అంచనాలు తప్పని రుజువయ్యాయని భజ్జీ అన్నాడు.