హైదరాబాద్: గతంలో జరిగిన ఇంగ్లాండ్లో రెండు పర్యటనల్లోనూ భారత్కు చేదు అనుభవాలే దక్కాయి. అంతేకాకుండా టెస్టు సిరీస్ల్లో ఘోర పరాభవాలు చవిచూసింది టీమిండియా. ఐతే ఈసారి సిరీస్లో భారత్ విజయావకాశాల్ని కొట్టిపారేయలేమంటున్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. టీమిండియా విజయాన్ని నిర్దేశించి బ్యాట్స్మెన్ ప్రదర్శనేనని నిర్ధారించాడు.
'టెస్టుల్లో పోటీ ఇవ్వాలంటే ముందు ఒక ఇన్నింగ్స్లో 400 పరుగులు చేయాలి. ఎవరైతే తొలి ఇన్నింగ్స్లో ఈ స్కోరు సాధిస్తారో వాళ్లకే విజయావకాశాలుంటాయి. ఈ సిరీస్లో టీమిండియాకు కచ్చితంగా విజయావకాశాలుంటాయి. టీమిండియా మెరుగైన జట్టు కాబట్టే.. బ్యాట్స్మెన్ రాణించడం చాలా కీలకం. వాళ్లు సత్తా చాటితే కచ్చితంగా టెస్టు సిరీస్ గెలవొచ్చు' అని గంగూలీ పేర్కొన్నాడు.
మరోవైపు వన్డే సిరీస్లో వైఫల్యంతో విమర్శలెదుర్కొంటున్న ధోనికి సౌరవ్కు మద్దతుగా నిలిచాడు. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్లో ధోని కచ్చితంగా రాణిస్తాడని గంగూలీ అన్నాడు. రిటైర్మెంట్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది అతనేనని చెప్పాడు.
రహానె, కేఎల్ రాహుల్లకు భారత జట్టులో ఎక్కువ అవకాశాలు దక్కడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేసిన గంగూలీ వ్యాఖ్యలతో మరో మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ కూడా ఏకీభవించాడు. 'మూడు, నాలుగు స్థానాల్లోని ఆటగాళ్లు అత్యంత కీలకం. రాహుల్, రహానె లాంటి సమర్థులైన ఆటగాళ్లకు కుదురకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా? ఒక టెస్టులో భారత జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడిని తర్వాతి వన్డే సిరీస్కు ఎలా తప్పిస్తారు? రాహుల్ లాంటి ఆటగాడికి జట్టులో సుస్థిర స్థానం లేకపోవడం మంచిది కాదు' అని ఆయన వివరించాడు.