
హైదరాబాద్: భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021కు ముందే భారత జట్టు టీ20 పగ్గాలు వదిలిస్తున్నా అని కోహ్లీ చెప్పేశాడు. మెగా టోర్నీలో భాగంగా సోమవారం దుబాయ్ వేదికగా నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్.. కెప్టెన్గా కోహ్లీకి చివరిది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో జట్టు పగ్గాలను స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అందించింది బీసీసీఐ. ఇకపై టీ20లకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు.
భారత టీ20 క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఎంపికయిన నేపథ్యంలో అతడి రికార్డ్స్ మరియు గణాంకాలు ఓసారి పరిశీలిద్దాం. వివిధ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కెప్టెన్గా 10 వన్డేల్లో భారత జట్టుకు 8 విజయాలు అందించాడు. మరో రెండు మ్యాచ్ల్లో ఓటమి ఎదురైంది. ఇక అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ సారథ్యంలో టీమిండియా 19 మ్యాచ్ల్లో 15 గెలిచి, నాలుగింటిలో ఓడింది. దాంతో రోహిత్ కెప్టెన్సీ రికార్డ్స్ మరియు గణాంకాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఐపీఎల్లో సారథిగా ముంబై ఇండియన్స్కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు రోహిత్. 129 టీ20ల్లో ముంబైకి సారథ్యం వహించి.. 75 మ్యాచులో విజయాలు అందించాడు. 50 మ్యాచుల్లో ఓడిపోగా.. మరో నాలుగు మ్యాచులు ముంబై ఓడింది.
టీ20ల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ వయసే ఎక్కువ. రోహిత్కు ఇప్పుడు 34 ఏళ్లు. దాంతో భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో వినిపించింది. కానీ 2022లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆ టోర్నీకి ఎక్కువ సమయం లేదు. కాబట్టి ఈ సమయంలో యువకులకు అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేయడం కంటే.. ఇప్పటికే కెప్టెన్గా నిరూపించుకున్న రోహిత్కు జట్టు పగ్గాలు అందించడం మేలని బీసీసీఐ భావించింది. అవసరం అనుకుంటే వచ్చే రెండేళ్ల తర్వాత రోహిత్ నుంచి నాయకత్వ బాధ్యతలు యువ ఆటగాళ్లకు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్ల వైపు చూసే అవకాశాలను కొట్టిపారేయలేం. కివీస్తో సిరీస్తో పూర్తిస్థాయిలో టీ20 కెప్టెన్గా మరో అధ్యాయం ప్రారంభించనున్న రోహిత్ ఎలా జట్టును నడిపిస్తాడో చూడాలి.
టీ20 ప్రపంచకప్ 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన టీమిండియా సెమీస్ రేసులో వెనుకబడింది. దీంతో చివరి మూడు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించినా.. టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. టీమిండియాకు విరాట్ కోహ్లీ 50 మ్యాచుల్లో టీ20 జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్ 32 టీ20 మ్యాచ్లను గెలిచి.. మరో 16 మ్యాచ్లను ఓడిపోయింది. ఇక రెండు మ్యాచ్లలో ఫలితం రాలేదు. టీ20లలో కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా.. మంచి విజయాలు అందించాడు.