మాంఛెస్టర్: ఇంకో రెండు గంటలు! క్రికెట్ ప్రపంచం అంతా ఎప్పుడెప్పుడా అని వేయికళ్లేం ఖర్మ.. కోట్లాది కళ్లతో ఎదురు చూస్తోన్న సమయం రాబోతోంది. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మరో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ఆరంభం కాబోతోంది. భారత కాలమానం ప్రకారం..మధ్యాహ్నం 3 గంటలకు ఇన్నింగ్ మొదలవుతుంది. ఇంకా సమయం ఉండగానే అభిమానులు గుంపులు గుంపులుగా మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియానికి పోటెత్తుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చిన క్రికెట్ ప్రేమికులతో మాంఛెస్టర్లోని హోటళ్లన్నీ ఇదివరకే నిండిపోయాయి. తాజాగా- వారంతా స్టేడియానికి చేరుకుంటున్నారు. దీనితో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది.
పాకిస్తాన్ గ్రీన్ ఆర్మీపై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?
ఏదేశమేగినా..ఎందుకాలిడినా!
భారతీయులకు ఓ అలవాటు ఉంది. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా భూమి భారతిని పొగుడుతారో లేదో తెలియదు గానీ..జన జాతరలను మాత్రం సృష్టిస్తుంటారు. పండగ వాతావరణాన్ని కల్పించుకుంటారు. లోకల్ బ్రాండ్ ముద్రించుకుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్లోని మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం అచ్చం అలాగే కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్లో గణేషుని విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ట్యాంక్బండ్పై ఎలాంటి దృశ్యాలు దర్శనం ఇస్తాయో.. ప్రస్తుతం అలాంటి కోలాహలం స్టేడియం బయట నెలకొని ఉంది.
జాతీయ పతాకాలను చేత పట్టుకుని వేలాది మంది భారతీయులు స్టేడియం వద్ద సందడి చేస్తున్నారు. తమ శరీరంపై అణువణువూ త్రివర్ణ పతాకంలోని రంగులను పూసుకుని, ప్లాస్టిక్ బూరలు ఊదుకుంటూ హల్చల్ చేస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా ప్రదర్శించడానికి ప్లకార్డుల కట్టలను వెంట బెట్టుకుని స్టేడియం వద్ద బారులు తీరుతున్నారు.
భారత్-పాక్ అభిమానుల చెట్టాపట్టాల్!
భారతీయులకు సందడికి ఏ మాత్రం తీసిపోని విధంగా పాకిస్తాన్ అభిమానులు కూడా తమదైన శైలిలో విచిత్ర విన్యాసాలను చేస్తూ కనిపిస్తున్నారు స్టేడియం వద్ద. వృద్ధులు సైతం యువరక్తంతో పోటీ పడుతున్నారు. మ్యాచ్ను తిలకించడానికి విచ్చేసిన భారత్, పాకిస్తాన్ దేశాల అభిమానులు చెట్టాపట్టాలు వేసుకుని స్టేడియానికి వస్తుండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. గెలుపోటముల సంగతులను పక్కన పెడితే.. గెలిచేది మాత్రం క్రికెట్టేగా అంటూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు వారంతా.