
కర్ణాటక ఆల్రౌండర్..
అతనే- స్టువర్ట్ బిన్నీ (Stuart Binny). 37 సంవత్సరల కర్ణాటక ఆల్రౌండర్. దేశవాళీ మ్యాచ్లు, రంజీ ట్రోఫీల్లో రాణించిన క్రికెటర్. ఆ ప్రతిభతోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. టీమిండియా తరఫున ఆరు టెస్ట్ మ్యాచ్లు, 14 వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20ల్లో ఆడాడు. టెస్టుల్లో 194 పరుగులు, వన్డే ఇంటర్నేషనల్స్లో 230 రన్స్ చేశాడు. టీ20 ఫార్మట్ క్రికెట్లో స్టువర్ట్ బిన్నీ చేసింది 35 పరుగులే. ఆరు టెస్టుల్లో మూడు వికెట్లను మాత్రమే పడగొట్టాడు.

గుడ్ స్ట్రైక్ రేట్
వన్డే ఇంటర్నేషనల్స్లో ఫర్వాలేదనిపించుకున్నాడు. 20 వికెట్లను తీసుకున్నాడు. టీ20ల్లో అయిదు వికెట్లను పడగొట్టిన ఘనత అతని పేరిట ఉంది. జాతీయ జట్టు కంటే అధికంగా ఐపీఎల్ టోర్నమెంట్లో కనిపించాడు స్టువర్ట్ బిన్నీ. 95 మ్యాచ్లను ఆడాడు. 880 పరుగులు చేశాడు. 22 వికెట్లను పడగొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 130గా ఉంది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్తో పాటు తన హోమ్ స్టేట్ కర్ణాటకకు చెందిన రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఫ్రాంఛైజీల తరఫున ఐపీఎల్ టోర్నమెంట్లలో మ్యాచ్లు ఆడాడు.

ఐపీఎల్లో కీలక ఫ్రాంఛైజీల తరఫున..
2011 నుంచి 2015 వరకు అతను ఐపీఎల్లో ఆయా ఫ్రాంఛైజీలకు ఎంపికయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. రెండు కోట్ల రూపాయలతో అతన్ని కొనుగోలు చేసింది. స్టువర్ట్ బిన్నీకి క్రికెట్ కొత్త కాదు. క్రికెట్ నేపథ్యం గల కుటుంబం నుంచే వచ్చాడతను. రోజర్ బిన్నీ కుమారుడే అతను. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ టోర్నమెంట్ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు రోజర్ బిన్నీ. తండ్రి వారసుడిగా క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.

బంగ్లాపై చెక్కు చెదరని రికార్డ్..
17 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు స్టువర్ట్ బిన్నీ ఫస్ట్క్లాస్ కేరీర్ కొనసాగింది. కర్ణాటక టీమ్ రంజీ టైటిళ్లను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. రంజీల్లో అతను 4,796 పరుగులు చేశాడు. 146 వికెట్లు తీసుకున్నాడు. 2014లో తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. మిర్పూర్లో బంగ్లాదేశ్ జట్టుపై అద్భుతంగా సత్తా చాటాడు. నాలుగు పరుగులే ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టడం అతనికి మాత్రమే సాధ్యపడింది.

చివరి మ్యాచ్ అదే..
అదే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా జట్టులోనూ అతనికి స్థానం దక్కింది. ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్తో స్టువర్ట్ బిన్నీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో 10 ఓవర్లు మాత్రమే బౌల్ చేశాడు.. వికెట్లేమీ తీసుకోలేదు. 2015 వరల్డ్ కప్ టీమ్కు కూడా అతను ఎంపికయ్యాడు గానీ.. మ్యాచ్లను ఆడే అవకాశం అతనికి రాలేదు. బెంచ్కే పరిమితమయ్యాడు. చివరిసారిగా స్టువర్ట్ బిన్నీ 2016లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

మయాంతి లాంగర్తో..
లాండర్ హిల్లో వెస్టిండీస్తో జరిగిన టీ20.. అతని కేరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ మ్యాచ్లో అతను 32 పరుగులు చేశాడు. క్రికెట్ కామెంటేటర్ మయాంతి లాంగర్ను పెళ్లి చేసుకున్నాడతను. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఎంపికైన మరుసటి ఏడాదే అతని వివాహం జరిగింది. కామెంటేటర్గా పరిచయమైన మయాంతిని ఇష్టపడి పెళ్లాడాడు స్టువర్ట్ బిన్నీ. తాజాగా అతను తన కేరీర్కు గుడ్బై చెప్పాడు. కామెంటేటర్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












