
భారత ఆల్ రౌండర్ రుమేలీ ధార్ 38సంవత్సరాల వయస్సులో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2003లో ఇంగ్లాండ్ జట్టుపై అరంగేట్రం చేసిన రుమేలీ ధార్.. 2018లో ఆస్ట్రేలియాతో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది. ఆమె 2009లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఆరు వికెట్లు పడగొట్టింది. టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచింది. ఇక దక్షిణాఫ్రికాలో జరిగిన 2005 ప్రపంచకప్ ఫైనల్కు టీమిండియా చేరుకోవడంలో రుమేలీ ధార్ కీలకపాత్ర పోషించింది. ఇకపోతే భారత మహిళల క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్లలో రుమేలీ ఒకరు.
ఆమె నాలుగు టెస్టు మ్యాచ్లతో సహా టీమిండియా తరపున మొత్తం 100అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. ఆమె 78వన్డేలలో 19.61సగటుతో 961పరుగులు చేసింది. 18 టీ20లలో 18.71సగటుతో 88.51స్ట్రైక్ రేట్తో 131పరుగులు చేసింది. ఆమె నాలుగు టెస్ట్ మ్యాచ్లలో 29.5సగటుతో 236 పరుగులు చేసింది. రైట్ ఆర్మ్ పేసర్ అయిన రుమేలీ ధార్.. తన బౌలింగ్ నైపుణ్యంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో 76వికెట్లు తీసింది. ఇకపోతే బుధవారం మధ్యాహ్నం తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
'పశ్చిమ బెంగాల్లోని శ్యామ్నగర్లో ప్రారంభమైన నా 23ఏళ్ల క్రికెట్ కెరీర్... నేటితో ఎండ్ అవుతుంది. నేను అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను' అని ధార్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసింది. ' ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. చాలా కాలం పాటు భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావిస్తున్నాను. 2005లో ప్రపంచ కప్ ఫైనల్ను ఆడడాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. వరుస గాయాలు నా కెరీర్ను వేధించాయి. అయినా ప్రతిసారి నేను మరింత బలంగా కమ్ బ్యాక్ కావడానికి ప్రయత్నించాను. ఈ రోజు నేను ఎప్పటినుంచో ఇష్టపడే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులకు, బీసీసీఐకి, నా స్నేహితులకు, నేను ప్రాతినిధ్యం వహించిన బెంగాల్, రైల్వేస్, ఎయిర్ ఇండియా, ఢిల్లీ, రాజస్థాన్ మరియు అస్సాం జట్లకు, నా సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన వారందరికీ ధన్యవాదాలు. వీరందరు నేను భారత జట్టు తరఫున ఆడేందుకు ఎంతో హితోధిక సాయం చేశారు. ఇక క్రికెట్కు ముగింపు పలికినా.. యువ క్రికెట్ క్రీడాకారిణులను వెలుగులోకి తేవడానికి నావంతు సదా ప్రయత్నిస్తానను' అంటూ రుమేలీ పేర్కొంది.