సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా భారత్-ఆస్టేలియాల మధ్య మార్చి 26(గురువారం)న జరగనున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అటు భారత అభిమానులతో పాటు, ఇటు ఆస్టేలియా అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ మ్యాచ్ని విమాన సంస్ధలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. భారత్ నుంచి ఆస్టేలియాకు వెళ్లే అన్ని విమాన సంస్ధలు టికెట్ ధరను ఏకంగా 10-15 శాతం ఎక్కువ రెట్లు పెంచేశాయి. ఇక మెల్బోర్న్- సిడ్నీ రూట్లలో టికెట్ ధరలు 15-20 శాతం పెరిగాయి.
యాత్రా.కామ్ ప్రెసిడెంట్ శరత్ దల్లా వార్తా సంస్ధ పీటీఐతో మాట్లాడుతూ భారత్-ఆస్టేలియా జట్లు సెమీ ఫైనల్స్లోకి అర్హత సాధించడంతో ఎకానమీ టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయని అన్నారు. భారత్ ఫైనల్కు చేరినట్లైతే ఈ టికెట్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

'సెమీస్ టిక్కెట్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నేను 90 డాలర్లు (రూ. 5600) పెట్టి టిక్కెట్ కొనుక్కున్నా. కొంతమంది ఎక్కువ డబ్బిస్తాం ఆ టిక్కెట్ మాకివ్వమంటూ బతిమిలాడుతున్నారు. ఏకంగా 1000 (రూ. 62300) నుంచి 1500 (రూ. 93570) డాలర్లు ఇస్తామంటున్నారు. కానీ, నేను బ్లాక్లో టిక్కెట్ అమ్మదలచుకోలేదు' అని సిడ్నీలో పనిచేస్తున్న భారత ఇంజనీర్ ధ్రువచంద్ర తెలిపాడు.
మార్చి 24న దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి సెమీ పైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించి, చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారి పైనల్కు న్యూజిలాండ్ అర్హత సాధించింది.
ఇది ఇలా ఉంటే సిడ్నీలో జరిగే సెమీ పైనల్ మ్యాచ్కి టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గర్ల్ ప్రెండ్ అనుష్క శర్మ సిడ్నీ చేరుకున్నట్టు తెలుస్తోంది. టీమిండియా నాకౌట్కు చేరుకోగానే, ఆటగాళ్లతో ఉండేందుకు వారి భార్యలు, ప్రియురాళ్లకు బోర్డు అనుమతినిచ్చింది. కాగా, గురువారం జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో తన ప్రియుడు విరాట్ కోహ్లీకి మద్దతు తెలిపేందుకు అనుష్క సిడ్నీ వచ్చింది.