
చెన్నై: ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఘోరంగా పరాజయం పాలవుతుందని తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఏడునెలల కిందటే జోస్యం చెప్పాడు. అతని పేరు బాలాజీ హాసన్. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన బాలాజీ హాసన్.. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో తమిళనాడులో పొంగల్ పండగ సందర్భంగా ఓ తమిళ న్యూస్ ఛానల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రపంచకప్ విజేతపై యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమం అంతా తమిళంలో కొనసాగింది.సెమీ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతుందని బాలాజీ హాసన్ స్పష్టంగా చెప్పాడు. పాయింట్ల పట్టిలో భారత్ అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంటుందని జోస్యం చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి నాలుగు స్థానాల్లో నిల్చుంటాయని ఊహించాడు. అది నిజమైంది.
దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను ప్రముఖ నటుడు మాధవన్ గురువారం తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రపంచకప్ టోర్నమెంట్కు సంబంధించిన ప్రతి అంశం నిజమైందని, ఇది అద్భుతమని అంటూ మాధవన్ కామెంట్స్ చేశారు.