ఈరోజు ఎంతో ప్రత్యేకం.. 'ప్రపంచకప్'కు ఎనిమిదేళ్లు

ఈ రోజు భారత క్రికెట్ చరిత్రకు ఎంతో ప్రత్యేకం. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను చిత్తు చేసి టీమిండియా రెండోసారి ప్రపంచకప్ని సొంతం చేసుకుంది. దాదాపు 28 సంవత్సరాల కల నెరవేరడంతో.. భారత అభిమానులు 2011, ఏప్రిల్ 2వ రోజును ఎప్పటికీ మర్చిపోరు.

జయవర్ధనే సెంచరీ:
2011, ఏప్రిల్ 2న ఫైనల్ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. లంక జట్టులో వెటరన్ ఆటగాడు మహేలా జయవర్ధనే (103) సెంచరీ చేసాడు. కెప్టెన్ కుమార సంగక్కర (48) పరుగులు చేయగా.. ఇన్నింగ్స్ చివరలో తిసారా పెరీరా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.

ఆదుకున్న గంభీర్:
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ (0), క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (18)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ సమయంలో మరో ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత జట్టును ఆదుకున్నాడు. కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 35 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్ చేరాడు.
మహేంద్రుడి మాయ:
కోహ్లీ అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన మహీ ప్రశాంతంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. అయితే గంభీర్ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఈ సమయంలో మహీ తన మార్క్ ఆటతో మాయ చేసాడు. మరోవైపు యువీ కూడా చక్కటి సహకారం అందించాడు. ఇక చివరి 11 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. మహీ హెలికాఫ్టర్ షాట్తో సిక్సు బాది ఇన్నింగ్స్ ముగించాడు. దీంతో కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులు చిరకాల కల నెరవేరింది. 1983 తర్వాత టీం ఇండియా రెండోసారి ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ని ముద్దాడింది.

మధుర స్మృతులు:
టీమిండియా ప్రపంచకప్ నెగ్గి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తికావడంతో భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం జరిగే ప్రపంచకప్నూ భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications