జయవర్ధనే సెంచరీ:
2011, ఏప్రిల్ 2న ఫైనల్ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. లంక జట్టులో వెటరన్ ఆటగాడు మహేలా జయవర్ధనే (103) సెంచరీ చేసాడు. కెప్టెన్ కుమార సంగక్కర (48) పరుగులు చేయగా.. ఇన్నింగ్స్ చివరలో తిసారా పెరీరా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
ఆదుకున్న గంభీర్:
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ (0), క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (18)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ సమయంలో మరో ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత జట్టును ఆదుకున్నాడు. కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 35 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్ చేరాడు.
|
మహేంద్రుడి మాయ:
కోహ్లీ అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన మహీ ప్రశాంతంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. అయితే గంభీర్ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఈ సమయంలో మహీ తన మార్క్ ఆటతో మాయ చేసాడు. మరోవైపు యువీ కూడా చక్కటి సహకారం అందించాడు. ఇక చివరి 11 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. మహీ హెలికాఫ్టర్ షాట్తో సిక్సు బాది ఇన్నింగ్స్ ముగించాడు. దీంతో కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులు చిరకాల కల నెరవేరింది. 1983 తర్వాత టీం ఇండియా రెండోసారి ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ని ముద్దాడింది.
మధుర స్మృతులు:
టీమిండియా ప్రపంచకప్ నెగ్గి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తికావడంతో భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం జరిగే ప్రపంచకప్నూ భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.