ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ.. మ్యాచ్ అనంతరం మైదానంలో చిందులేసిన సంగతి తెలిసిందే. వికెట్లతో కోలాటం ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకుంటూ స్టేడియంలో అభిమానులకు అభివాదం చేశారు. అయితే వీరిద్దరూ మాత్రమే కాదు మిగితా ఆటగాళ్లు, అభిమానులు కూడా చిందులేస్తూ సరదాగా గడిపారు. అయితే వీరిలో దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిందులు అదరహో...
బ్లాక్ చెక్ షర్ట్ ధరించిన కపిల్ దేవ్ లైవ్ లోనే డప్పు శబ్దాలకు ఊగిపోతూ, చిరునవ్వు చిందుస్తూ స్టెప్పులేశారు. 66 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్ వేస్తూ ఆకట్టుకున్నారు. అలానే సునీల్ గవాస్కర్ ఆనందానికి కూడా అవధలు లేకుండా పోయాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో కామెంటేటర్గా వ్యవహరించిన ఆయన.. భారత జట్టు గెలవగానే మైదానంలో వచ్చి తన 75 ఏళ్ల వయసును మర్చిపోయి చిన్నపిల్లాడిలా చిందులేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

9 నెలల గ్యాప్ లో రెండు.. మొత్తంగా మూడు..
భారత్కు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. తొలిసారి 2002లో శ్రీలంకతో ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంది టీమిండియా. ఆ తర్వాత 2013లో మళ్లీ ఇప్పుడు 2025లో ఛాంపియన్స్గా నిలిచింది. అలానే 9 నెలల వ్యవధిలోనే భారత్కు ఇది రెండో ఐసీసీ ట్రోఫీ కావడం మరో విశేషం. అంతకుముందు 2024 టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది.