భారత్కు బంపరాఫర్.. జై షా సంచలన ప్రకటన!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత మహిళల జట్టు ప్రయాణం గ్రూప్ దశలోనే ముగిసిపోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసినప్పటికీ.. హర్మన్ప్రీత్ కౌర్ బ్రిగేడ్కు ఓ భారీ ఊరట లభించింది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028కి అధికారికంగా అర్హత సాధించింది. ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో భారత్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కల చెదిరినప్పటికీ.. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేస్తుండటం.. అందులో భారత్కు చోటు దక్కడం క్రీడా వర్గాల్లో పెద్ద మైలురాయికి నిలిచింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒలింపిక్స్లో క్రికెట్ రీఎంట్రీకి పునరాగమనానికి సంబంధించిన అధికారిక క్వాలిఫికేషన్ ప్రక్రియను ప్రకటించింది. ఈ నయా రూల్స్ ప్రకారం.. మహిళల క్రికెట్లో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించిన మొదటి 4 జట్లలో భారత జట్టు కూడా చోటు సంపాదించుకుంది. వరల్డ్ కప్లో భారత జట్టు చివరి నలుగురిలో నిలవలేకపోయినప్పటికీ.. టోర్నీలో పాల్గొన్న ఆసియా దేశాలన్నింటిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచన జట్టుగా నిలిచింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆసియా ఖండం నుంచి కేవలం ఒకే ఒక జట్టుకు నేరుగా ఒలింపిక్ కోటా లభిస్తుంది. ఆ స్థానాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఒక్కో జట్టుకు నేరుగా ప్రవేశం కల్పించారు. ఈ పద్ధతిలో భారత్(ఆసియా), ఆస్ట్రేలియా (ఓషియానియా), దక్షిణాఫ్రికా(ఆఫ్రికా), గ్రేట్ బ్రిటన్ (యూరప్) జట్లు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028 రేసులో ముందంజ వేశాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఐదో స్థానం ఆతిథ్య దేశమైన అమెరికా జట్టుకు దక్కే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం అమెరికా జట్టు జూన్ 30 నుంచి డిసెంబర్ 31, 2026 మధ్య కాలంలో ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో టాప్-15 లోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికా టాప్-15 లో నిలవలేకపోతే.. మార్చి 1, 2027 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా అత్యుత్తమ స్థానంలో ఉన్న తదుపరి జట్టుకు ఆ అవకాశం ఇస్తారు.
ఇక ఆరో, చివరి స్థానం కోసం 2027లో ప్రత్యేకంగా ఐసీసీ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీని నిర్వహించనున్నారు. ఇందులో క్వాలిఫై కానీ మిగిలిన 8 అత్యుత్తమ జట్లు తలపడతాయి. వెస్టిండీస్ జట్టు విషయంలోనూ ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ఒలింపిక్స్లో వెస్టిండీస్ ఒకే జట్టుగా కాకుండా విడివిడిగా విభిన్న కరేబియన్ దేశాలుగా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది కాబట్టి.. వారు అర్హత సాధిస్తే కరేబియన్ దేశాల మధ్య అంతర్గత క్వాలిఫైయింగ్ టోర్నీ నిర్వహిస్తారు. మెన్స్ క్రికెట్ ఈవెంట్ విషయానికి వస్తే, డిసెంబర్ 31, 2026 నాటి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి టాప్ జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి. ఆతిథ్య అమెరికా జట్టు పురుషుల విభాగంలోనూ టాప్-15 లో చోటు సంపాదించాల్సి ఉంటుంది.
ఒలింపిక్స్లో క్రికెట్ చేరడంపై ఐసీసీ చైర్మన్ జై షా స్పందిస్తూ.. "ఇది క్రికెట్ చరిత్రలోనే ఓ చారిత్రాత్మక ఘట్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు, అభిమానులకు క్రికెట్ను మరింత చేరువ చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. నయా క్వాలిఫికేషన్ సిస్టమ్ అన్ని సభ్య దేశాలకు పారదర్శకమైన మార్గాన్ని అందిస్తుంది" అని కొనియాడారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజోగ్ గుప్తా కూడా ఈ క్వాలిఫికేషన్ మోడల్ ప్రపంచవ్యాప్త ప్రాతినిధ్యానికి సమతుల్యతను ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
చివరిసారిగా 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ భాగమైంది. మళ్లీ ఇన్నాళ్లకు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028 ద్వారా రీ-ఎంట్రీ ఇస్తోంది. పురుషుల, మహిళల విభాగాల్లో చెరో ఆరు జట్లు తలపడనుండగా.. ప్రతి జట్టు 15 మంది సభ్యుల స్క్వాడ్ను ఎంపిక చేసుకోవచ్చు. జట్లను మూడు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ దశ ముగిశాక టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు గోల్డ్ మెడల్ కోసం, 3 మరియు 4 స్థానాల్లో నిలిచిన జట్లు బ్రాంజ్ మెడల్ కోసం తలపడతాయి. కాలిఫోర్నియాలోని పోమోనాలో ఉన్న 'ఫేర్ ప్లెక్స్' మైదానం ఈ చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications