భారత్ పర్యటనలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తొలిసారి గెలుపు రుచిచూసింది. ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్లో పరాజయాన్ని చవిచూసిన సౌతాఫ్రికా టీ20 సిరీస్లో మాత్రం సత్తాచాటింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాపై 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. భారత్ అమ్మాయిలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించినా అంతిమంగా గెలుపుతీరాలకు చేరలేకపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ (81; 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించింది. మరిజేన్ కాప్ (57; 33 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకంతో సత్తాచాటింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం దక్కింది. కెప్టెన్ వోల్వార్డ్ (33; 22 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి బ్రిట్స్ తొలి వికెట్కు 50 పరుగులు జోడించింది. ఆది నుంచే వీరిద్దరు దూకుడుగా ఆడటంతో సఫారీ సేన పవర్ప్లేలో 44 పరుగులు చేసింది.

వోల్వార్ట్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన మరిజేన్తో కలిసి బ్రిట్స్ స్కోరుబోర్డు పరుగులు పెట్టించింది. వీరిద్దరూ రెండో వికెట్కు 96 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. ఆఖర్లో ధాటిగా ఆడుతూ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 177 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (53 నాటౌట్; 30 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), స్మృతి మంధాన (46; 30 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు.

సూపర్ ఫామ్లో ఉన్న స్మృతి మంధాన మరోసారి సత్తాచాటింది.షెఫాలీ వర్మ (18; 14 బంతుల్లో, 2 ఫోర్లు) ఆది నుంచే విరుచుకుపడింది. భారత్ పవర్ప్లేలో 61 పరుగులు చేసింది. స్మృతి జోరు చూస్తే టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించింది.కానీ దక్షిణాఫ్రికా బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్లు తీసి దెబ్బకొట్టారు. మరో ఎండ్లో జెమీమా బౌండరీలతో హోరెత్తించింది. అయితే ఆమె పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ చెపాక్ వేదికగానే ఆదివారం జరగనుంది.