దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత మహిళా జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లకు 325 పరుగులు చేసింది. స్మృతి మంధాన (136; 120 బంతుల్లో, 18 ఫోర్లు, 2 సిక్సర్) వరుసగా మరో శతకం, హర్మన్ప్రీత్ కౌర్ (103 నాటౌట్; 88 బంతుల్లో, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదంతొక్కారు.
అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఉమెన్ టీమ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసింది. కెప్టెన్ వోల్వార్ట్ (135 నాటౌట్; 135 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), మరిజేన్ కాప్ (114; 94 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో పోరాడారు. పూజ వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా విజయానికి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు అవసరమవ్వగా.. పూజ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి ఒక్క పరుగే ఇచ్చింది.

కాగా, ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్లో నాలుగు సెంచరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి. స్మృతి, హర్మన్ప్రీత్, వోల్వార్ట్, మరిజేన్ శతకాలు సాధించారు. ఇక వన్డే ఫార్మాట్లో స్వదేశంలో భారత మహిళా జట్టు 300+ స్కోరు చేయడం ఇదే ప్రథమం. కాగా, తొలి వన్డేలో పాటు ఇవాళ సెంచరీ బాదిన స్మృతి మంధాన అరుదైన ఘనతలు సాధించింది. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్రకెక్కింది.
అలాగే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా బ్యాటర్గా మిథాలీ రాజ్తో కలిసి స్మృతి మంధాన సంయుక్తంగా నిలిచింది. 50 ఓవర్ల క్రికెట్లో మిథాలీ, స్మృతి తలో ఏడు సెంచరీ సాధించారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ సేన్ (6) దక్షిణాఫ్రికా పోరులో చరిత్రను తిరగరాసింది. టీమిండియా ఉమెన్స్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తన గత రికార్డును హర్మన్ప్రీత్ బద్దలుకొట్టింది. గతంలో 90 బంతుల్లో శతకం సాధించిన హర్మన్ప్రీత్ సఫారీలపై 87 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకుంది.
ఇక ఈ మ్యాచ్లో ఇరుజట్ల బ్యాటర్లు కలిసి 15 సిక్సర్లు కొట్టారు. ఉమెన్స్ వన్డే క్రికెట్లో ఇదే అత్యుత్తమం. అంతకుముందు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్లో నమోదైన 14 సిక్సర్ల పేరిట రికార్డు ఉండేది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ల్లో భారత్-దక్షిణాఫ్రికా పోరు రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో 646 పరుగులు నమోదైన విషయం తెలిసిందే. తొలి స్థానంలో ఇంగ్లండ్-సౌతాఫ్రికా (678) మ్యాచ్ ఉంది.