భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా, 600+ స్కోరు సాధించిన మొదటి ఉమెన్స్ టీమ్గా టీమిండియా రికార్డులకెక్కింది. చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఈ ఆల్టైమ్ రికార్డులు నెలకొల్పింది. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 603 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక స్కోరు (575/9 డిక్లేర్) రికార్డును బద్దలుకొట్టింది.
మహిళల టెస్టు క్రికెట్లో అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో భారత్ (603/6 డిక్లేర్, దక్షిణాఫ్రికాపై-2024) అగ్రస్థానానికి ఎగబాకింది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (575/9 డిక్లేర్, దక్షిణాఫ్రికాపై-2024), ఆస్ట్రేలియా (569/6 డిక్లేర్, ఇంగ్లండ్పై-1998), ఆస్ట్రేలియా (525 ఆలౌట్, భారత్పై- 1984), న్యూజిలాండ్ (517/8, ఇంగ్లండ్పై- 1996) ఉన్నాయి.

ఓవర్నైట్ స్కోరు 525/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ లంచ్ విరామానికి కొద్దిసేపు ముందు తొలి ఇన్నింగ్స్ను 603/6 వద్ద డిక్లేర్ చేసింది. హర్మన్ ప్రీత్ సింగ్ (69; 115 బంతుల్లో, 4 ఫోర్లు), రిచా ఘోష్ (86; 90 బంతుల్లో, 16 ఫోర్లు) నిలకడగా శనివారం ఆటను మొదలుపెట్టారు. ఈ క్రమంలో అర్ధశతకాలు అందుకున్నారు. అయితే దూకుడగా ఆడే క్రమంలో వీరిద్దరు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు చేరారు. రిచా సెంచరీ సాధించే వరకు ఇన్నింగ్స్ కొనసాగించాలనుకున్న భారత్ ఆమె ఔటవ్వడంతో డిక్లేర్ చేసింది.

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్కు 292 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ సాధించింది. 197 బంతుల్లో 205 పరుగులు చేసింది. 23 ఫోర్లు, 8 సిక్సర్లు బాదింది. మరో ఓపెనర్ తృటిలో 150 మార్క్ను చేజార్చుకుంది. 161 బంతుల్లో 149 పరుగులు చేసి పెవిలియన్కు చేరింది. స్మృతి 27 బౌండరీలు, 1 సిక్సర్ బాదింది. జెమీమా రోడ్రిగ్స్ (55; 94 బంతుల్లో, 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టకర్ రెండు వికెట్లు తీసింది.