డీవై పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు సంచలన ప్రదర్శన చేస్తోంది. తొలుత బ్యాటుతో అదరగొట్టిన టీమిండియా తర్వాత బంతితో మరింత చెలరేగింది. దీప్తి శర్మ (5/7) మాయాజాలానికి ఇంగ్లాండ్ 136 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా 292 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 428 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఆది నుంచే ఇంగ్లాండ్పై భారత్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఓపెనర్ డుంక్లీ (11)ని రేణుక సింగ్ క్లీన్ బౌల్డ్ చేసి తొలి దెబ్బకొట్టింది. కాసేపటికే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ హీథర్ (11)ను పూజా పెవిలియన్కు చేర్చింది. అయితే బ్యూమాంట్ (10)తో కలిసి నాట్ సివర్ (59) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ పూజ మెరుపు ఫీల్డింగ్తో బ్యూమాంట్ రనౌటైంది.

ఆ తర్వాత ఇంగ్లాండ్కు అవకాశం ఇవ్వకుండా టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. దీప్తి శర్మ స్పిన్ దాడికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్ చేరడానికి పోటీపడ్డారు. 5.3 ఓవర్లు వేసిన దీప్తి ఏడు పరుగులిచ్చి అయిదు వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్ 10 పరుగుల వ్యవధిలో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి అయిదు వికెట్లు, స్నేహ రెండు, రేణుక , పూజ చెరో వికెట్ తీశారు.
అంతకుమందు రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కొద్దిసేపటికే దీప్తి శర్మ (67) లారెన్ బెల్ బౌలింగ్లో ఔటైంది. ఆ తర్వాత రేణుక సింగ్ (1), గైక్వాడ్ (0) వరుసగా పెవిలియన్కు చేరారు. ఇవాళ ఆటలో భారత్ బ్యాటర్లు పది ఓవర్లు మాత్రమే క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ బెల్ చెరో మూడు వికెట్లు, కేట్ క్రాస్, నాట్ సివర్, చార్లీ డీన్ తలో ఒక వికెట్ తీశారు.
టీమిండియా బ్యాటర్లలో సతీశ్ శుభా (69), జెమిమా రోడ్రిగ్స్ (68), దీప్తి శర్మ (67), యస్తికా భాటియా (66) అర్ధ శతకాలు సాధించారు. హర్మన్ప్రీత్ కౌర్ 49 పరుగుల వద్ద రనౌటైంది. స్నేహ రాణా (30), షెఫాలీ వర్మ (19), స్మృతి మంధాన (17) పరుగులు చేశారు.