డీవై పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీస్కోరు చేసింది. 104.3 ఓవర్లలో 428 పరుగులు చేసింది. అయితే ఓవర్ నైట్ స్కోరు 410/7 తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 18 పరుగులే చేసి ఆలౌటైంది.
రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే దీప్తి శర్మ (67) లారెన్ బెల్ బౌలింగ్లో ఔటైంది. ఆ తర్వాత రేణుక సింగ్ (1), గైక్వాడ్ (0) వరుసగా పెవిలియన్కు చేరారు. ఇవాళ ఆటలో భారత్ బ్యాటర్లు పది ఓవర్లు మాత్రమే క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ బెల్ చెరో మూడు వికెట్లు, కేట్ క్రాస్, నాట్ సివర్, చార్లీ డీన్ తలో ఒక వికెట్ తీశారు.

టీమిండియా బ్యాటర్లలో సతీశ్ శుభా (69), జెమిమా రోడ్రిగ్స్ (68), దీప్తి శర్మ (67), యస్తికా భాటియా (66) అర్ధ శతకాలు సాధించారు. హర్మన్ప్రీత్ కౌర్ 49 పరుగుల వద్ద రనౌటైంది. స్నేహ రాణా (30), షెఫాలీ వర్మ (19), స్మృతి మంధాన (17) పరుగులు చేశారు.
అంతకుముందు తొలి రోజు ఆటలో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల టెస్ట్ క్రికెట్లో 88 ఏళ్ల తర్వాత తొలి రోజే 400 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఉమెన్స్ టెస్ట్ క్రికెట్లో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ (431/4) తొలి స్థానంలో ఉంది. 1935లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో ఇంగ్లాండ్ ఈ ఘనత సాధించింది.