
హైదరాబాద్: పాత ఫలితాలను పక్కకు పెట్టి టీ20 ముక్కోణపు సిరీస్లో బోణీ చేయాలని భారత మహిళల జట్టు ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది టీమిండియా మహిళల జట్టు. ఇప్పుడు ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో గెలిచి వరుస ఓటములకు బ్రేక్ వేయాలనుకుంటోంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్లో భారత్ రాత మారాలంటే మాత్రం అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేయాల్సిన అవసరముంది.
ఈ మ్యాచ్ గురించి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. 'గత రెండు నెలలుగా నిరంతరాయంగా క్రికెట్ ఆడుతోంది. ఈ క్రమంలో ముందుగా దక్షిణాఫ్రికా జట్టుపై సిరీస్ విజయాన్ని నమోదు చేసుకున్నాం. కానీ, ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో మాత్రం తడబడ్డాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్లోనూ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుతో ఓడాం. దీనికి కారణం నిరంతరాయంగా మ్యాచ్లు ఆడటం కానే కాదు. అస్సలు ఇదే మాకు బాగా కలిసొచ్చే అంశం.' అని ఆమె పేర్కొన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వైస్ కెప్టెన్ స్మృతి మంథాన ఫామ్లోకి వచ్చిందని ఇది జట్టుకు బాగా కలిసొచ్చే అంశమని తెలిపారు. అదే మ్యాచ్లో ఝులన్ కూడా చక్కని బౌలింగ్ శైలిని ప్రదర్శించారని వివరించారు. కేవలం చివరలో తడబాటు కారణంగానే ఆ మ్యాచ్ ను కోల్పోయామని మళ్లీ అలాంటి పొరబాటు పునరావృతం చేయమని పేర్కొన్నారు.
మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వరుసగా విఫలమవుతుండడం జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాటింగ్ పిచ్పై అనుభవజ్ఞులైన మిథాలీ, హర్మన్ప్రీత్, వేదా కృష్ణమూర్తి చెలరేగాలి. యువ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ సత్తాకు తగ్గ ప్రదర్శన చేయాలి. జులన్ రాకతో బౌలింగ్ విభాగం కొంత బలపడినా.. ఆమెకు మిగతా బౌలర్లు సహకరించాల్సిన అవసరముంది. ఈ మ్యాచ్లో గనక భారత్ ఓడితే ఫైనల్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.