ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు దారుణంగా విఫలమైంది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో కూడా ఓటమిపాలై సిరీస్ను 0-3తో పేలవంగా ముగించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 190 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. పరుగుల పరంగా భారత్కు ఇది మూడో అతిపెద్ద ఓటమి. మరోవైపు భారత్పై ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిదో వన్డే సిరీస్ను గెలుచుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ లిచ్ఫీల్డ్ (119; 125 బంతుల్లో) తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ సెంచరీ సాధించింది. లిచ్ఫీల్డ్ తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా 63, 78 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. మరో ఓపెనర్ అలిస్సా హీలి (82; 85 బంతుల్లో) కూడా భారీ స్కోరు సాధించింది. వీరిద్దరు తొలి వికెట్కు 189 పరుగులు జోడించారు.

అయితే తర్వాత భారత్ బౌలర్లు సత్తాచాటి స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ను దెబ్బ కొట్టారు. కానీ అనంతరం బ్యాటింగ్కు వచ్చిన గార్డెనర్ (30), అనబెల్ (23), అలన (26*) దూకుడుగా ఆడుతూ స్కోరును 338/7కు చేర్చారు. టీమిండియా బౌలర్లలో శ్రేయాంక పాటిల్ మూడు వికెట్లతో సత్తాచాటింది. అమంజోత్ కౌర్ రెండు వికెట్లు, పూజ, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. అయితే ఈ క్రమంలో దీప్తి రికార్డు సృష్టించింది. టీమిండియా బౌలర్లలో వన్డే ఫార్మాట్లో 100 వికెట్లు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది స్మృతి మంధాన (29) టాప్ స్కోరర్గా నిలిచింది. ఛేదనలో ఏ దశలోనూ టీమిండియా పైచేయి సాధించలేకపోయింది. వరుసగా వికెట్ల చేజార్చుకుంటూ తీవ్ర ఒత్తిడికి లోనైంది. జెమీమా రోడ్రిగ్స్ (25), దీప్తి శర్మ (25) ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో వేర్హమ్ మూడు వికెట్లు, మేగన్ స్కట్, అలన కింగ్, సదర్లాండ్ తలో రెండు వికెట్లు తీశారు. గార్డెనర్ ఒక వికెట్ పడగొట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్గా ఆసీస్ ఓపెనర్ లిచ్ఫీల్డ్ నిలిచింది.
కాగా, ఏకైక టెస్టులో చారిత్రక విజయం సాధించి వన్డే సిరీస్ను వైట్ వాష్తో కోల్పోయిన హర్మన్ప్రీత్ సేన ఆస్ట్రేలియాతో మరో సిరీస్ ఆడనుంది. జనవరి 5 నుంచి ఆసీస్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్లు డీవై పటేల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఏడాది ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ను ఇరుజట్లు సవాలుగా తీసుకోనున్నాయి.