ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో చారిత్రక విజయం సాధించిన భారత మహిళ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. ఇవాళ నుంచి ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టును ఆడనుంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు అనుకూలంగా ఉంటుంది.
అయితే ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో భారత మహిళ జట్టు పది సార్లు తలపడగా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ను చిత్తుచేసి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న భారత్ ఆసీస్ను ఓడించి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్పై టీమిండియా 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహిళల టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం.

కాగా, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆస్ట్రేలియా మహిళలు చివరిసారి 1984 ఫిబ్రవరిలో ఇండియాలో టెస్టు మ్యాచ్ ఆడారు.ఇక ఇరు జట్లు టెస్టు ఫార్మాట్లో చివరిసారి రెండేళ్ల కింద తలపడ్డాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఇవాళ మ్యాచ్లో రిచా ఘోష్ టెస్టుల్లో అరంగేట్రం చేసింది.
భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), యాస్తిక భాటియా, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రాకర్.
ఆస్ట్రేలియా: బెత్ మూనీ, ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎలిస్ పెర్రీ, తాహిలా మెక్గ్రాత్, అలిస్సా హీలీ(కెప్టెన్), అనాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, జెస్ జోనాసెన్, అలనా కింగ్, కిమ్ గార్త్, లారెన్ చీటిల్