మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలనుకున్న భారత్కు షాక్ ఎదురైంది. డీవై పటేల్ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో నిర్ణయాత్మక ఆఖరి టీ20 మంగళవారం జరగనుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. నాలుగు ఓవర్లలోనే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. షెఫాలి వర్మ (1), జెమీమా రోడ్రిగ్స్ (13) విఫలమయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్మృతి మంధాన (23) కూడా పెవిలియన్కు చేరింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (6) మరోసారి నిరాశపర్చింది. దీంతో టీమిండియా 54 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రిచా ఘోష్ (23; 19 బంతుల్లో), దీప్తి శర్మ (30; 27 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రిచా దూకుడుగా ఆడగా, ఇన్నింగ్స్ ఆఖరి వరకు ఉన్న దీప్తి నిలకడగా ఆడింది. ఆసీస్ బౌలర్లలో కిమ్గార్త్ , సదర్లాండ్, వేర్హామ్ తలో రెండు వికెట్లు తీశారు. గార్డెనర్ ఒక వికెట్ పడగొట్టింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అలీసా హీలీ (26; 21 బంతుల్లో), బెత్ మూనీ (20; 29 బంతుల్లో) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 51 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరిని టీమిండియా స్వల్పవ్యవధిలోనే ఔట్ చేసి తిరిగి పోటీలోకి వచ్చింది.
కానీ, తాహితా (19; 21 బంతుల్లో)తో కలిసి ఎలీస్ పెర్రీ (34*; 21 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. ఎలీస్ ఆఖరి వరకు క్రీజులో ఉండి దూకుడుగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఎలీస్కు లిచ్ఫీల్డ్ (18*; 12 బంతుల్లో) సహకరించింది. కాగా, తన కెరీర్లో 300 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఎలీస్ సిక్సర్తో మ్యాచ్ను ముగించడం విశేషం. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు, శ్రెయాంక, పూజ చెరో వికెట్ తీశారు.