భారత మహిళల జట్టు అదరగొట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి టీ20లో సౌతాఫ్రికా విజయం సాధించగా, రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా ఒక్క సిరీస్లో కూడా విజయం సాధించకుండా ఇంటిముఖం పట్టింది.
ఏకైక టెస్టులో భారత్దే విజయం. మూడు వన్డేల సిరీస్ను హర్మత్ప్రీత్ సేన క్లీన్స్వీప్ చేసింది. ఇక ఆఖరి టీ20లోనూ గెలిచి పొట్టి ఫార్మాట్ సిరీస్ను సమం చేసింది. అయితే చివరి పోరులో దక్షిణాఫ్రికాను టీమిండియా చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మన బౌలర్ల ధాటికి 17.1 ఓవర్లలోనే 84 పరుగులకే కుప్పకూలింది. పూజ వస్త్రాకర్ నాలుగు వికెట్లు, రాధా యాదవ్ మూడు వికెట్లతో చెలరేగారు.

అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఆది నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయింది. కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. టాజ్మిన్ బ్రిట్స్ (20; 23 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోర్. బోష్ (17; 14 బంతుల్లో, 2 ఫోర్లు), మరిజేన్ (10; 8 బంతుల్లో, 2 ఫోర్లు) పరుగులు చేశారు.
అనంతరం ఛేదనలో భారత్ 10.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఘన విజయం సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (54 నాటౌట్;40 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫాలీ వర్మ (27 నాటౌట్; 25 బంతుల్లో, 3 ఫోర్లు) చెలరేగారు. స్మృతి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ అర్ధశతకం సాధించింది. అయితే భారత్ ఇన్నింగ్స్ నిదానంగా ఆరంభించింది. తొలి 4 ఓవర్లకు జట్టు స్కోరు 18/0 మాత్రమే. ఆ తర్వాత ఓపెనర్లు సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్మృతి సిక్సర్తో జట్టును విజయతీరాలకు చేర్చి హాఫ్ సెంచరీ మార్క్ను అందుకుంది. పూజ వస్త్రాకర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకుంది.