
శ్రీలంక మహిళల టీంతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక పల్లెకెలె వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ 39పరుగుల తేడాతో అద్వితీయ విజయం సాధించి తమకు ఎదురులేదని చాటి చెప్పింది. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత టీం నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 255పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (75పరుగులు 88బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), పూజా వస్త్రాకర్ (56పరుగులు 65బంతుల్లో 3సిక్సర్లు నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్ షఫాలీ వర్మ (49పరుగులు 50బంతుల్లో 5ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడింది. దీంతో ఇండియా శ్రీలంక ముందు టఫ్ టార్గెట్ ఉంచగలిగింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణవీర,రష్మీ డి సిల్వా, ఆటపత్తు చెరో రెండు వికెట్లు సాధించగా, కాంచనా,రణసింఘే, కవిషా దిల్హరి చెరో వికెట్ తీశారు.
ఇక తదనంతరం బౌలింగ్కు దిగిన భారత జట్టు.. శ్రీలంకను 216పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ మూడు వికెట్లతో చెలరేగింది. ఇక మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు, దీప్తీ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్, డియోల్ చెరో వికెట్ తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో శ్రీలంక బ్యాటర్లలో నీలాక్షి డి సిల్వా (48పరుగులు 59బంతుల్లో నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ మ్యాచ్లో అత్యధ్భుత ప్రదర్శనకు గాను హర్మన్ ప్రీత్ కౌర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందింది. అలాగే ఈ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం హర్మన్ ప్రీత్ కౌర్ను వరించింది.
ట్రోఫీ ప్రెజెంటేషన్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ మాకు చాలా గొప్పగా అనిపించింది. ఇక చివరి మ్యాచ్లో మేము సింగిల్స్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టాం. చివరి వరకు బ్యాటింగ్ చేయాలనేది మా ప్రాధాన్య అంశం. మా జట్టులో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు (మిథాలీ రాజ్, జులియన్ గోస్వామి) లేకుండా మేం తొలి విదేశీ పర్యటనకు వచ్చాం. మాకు ఈ పర్యటన విజయవంతం అయింది. ఇది ప్రారంభం మాత్రమే, మేం ఇంకా మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి.' అని పేర్కొంది.