
భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటక బ్యాటర్ అర్జున్ హొయసలతో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇద్దరు క్రికెటర్లు ఒకరినొకరు వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. హొయసల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కృష్ణమూర్తిని ట్యాగ్ చేస్తూ ప్రపోజల్ ఫోటో పెట్టగా.. యస్ అంటూ వేద రిప్లే ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి.
కర్ణాటకకు చెందిన వేదా కృష్ణమూర్తి టీమిండియా వుమెన్స్ తరఫున మొత్తం 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. ఇంగ్లాండ్లో జరిగిన 2017 మహిళల వన్డే ప్రపంచ కప్, అలాగే 2020మహిళల టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన భారత టీంలో ఆమె సభ్యురాలు. ఈ రెండు ఈవెంట్లలో భారత్ ఓడిపోయినప్పటికీ.. జట్టు ఫైనల్ చేరడంతో తన వంతు పాత్రను వేదా పోషించింది. 2020 మార్చి 8న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత వేదా జట్టుకు ఎంపిక కాలేదు. ఆమె చివరిసారిగా 2018లో నాగ్పూర్లో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ఆడింది. కృష్ణమూర్తి 2017, 2018లో హోబర్ట్ హరికేన్స్ కోసం ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆమె బర్మింగ్హామ్లో 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా స్టూడియోలో విశ్లేషకురాలిగా వ్యవహరించింది. ఇకపోతే రంజీ ప్లేయర్ అర్జున్ హొయసల 2016లో మహారాష్ట్రతో మొహాలీలో జరిగిన మ్యాచ్లో కర్ణాటక రంజీ ట్రోఫీ జట్టుకు గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. అతను చివరిసారిగా 2019 సీజన్లో శివమొగ్గ లయన్స్ తరపున కర్ణాటక ప్రీమియర్ లీగ్ (KPL)లో తలపడ్డాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ జట్టులో చాలా సార్లు తన వంతు పాత్ర పోషించాడు.