
హోవ్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకి జరిమానా పడింది. యువ సంచలనం షెఫాలీ వర్మ (38 బంతుల్లో 48; 8 ఫోర్లు, ఓ సిక్స్) బ్యాటింగ్లో సత్తాచాటితే.. చివర్లో స్పిన్నర్లు ఇంగ్లండ్ను దెబ్బకొట్టడంతో రెండో టీ20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్సేన 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లిష్ జట్టును చిత్తుచేసి మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం జరగనుంది.
ఓపెనర్ షెఫాలీ వర్మ మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31), స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (20) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. సాధారణ లక్ష్య ఛేదనలో ఓపెనర్ టామీ బ్యూమౌంట్ (59) విజృంభించడంతో ఓ దశలో 13.4 ఓవర్లకే 106 పరుగులు చేసింది ఇంగ్లండ్. అయితే భారత స్పిన్నర్లు పూనమ్ యాదవ్ (2/17), దీప్తి శర్మ (1/18), స్నేహ్ రాణా (0/21) ఇంగీష్ బ్యాట్స్మన్ను కట్టడి చేశారు. చివరి 5 ఓవర్లలో 33 పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది.
మ్యాచ్ చివర్లో ఉత్కంఠగా మారడంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బౌలింగ్ మార్పులపై పదేపదే సహచరులతో చర్చలు జరిపింది. మరోవైపు ఫీల్డింగ్ కూర్పుల కోసం కూడా ఎక్కువ సమయం కేటాయించింది. దాంతో మ్యాచ్ కాస్త ఆలస్యం అయ్యింది. దాంతో మ్యాచ్లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే భారత్ జట్టు ఒక ఓవర్ తక్కువగా వేసింది. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద భారత్ జట్టుకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా పడింది. మరోసారి హర్మన్ప్రీత్ ఇదే తప్పిదం చేస్తే.. జరిమానాతో పాటు హెచ్చరికలు జారీ చేస్తారు. మూడోసారి ఇదే తప్పిదం జరిగితే.. జరిమానాతో పాటు నిషేధం కూడా పడుతుంది.
'ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. నిర్ణీత సమయం కంటే ఒక ఓవర్ తక్కువగా వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించాం' అని ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్కు చెందిన మ్యాచ్ రిఫరీ ఫిల్ విట్టికేస్ పేర్కొన్నారు.