
ఆఖరి ఓవర్లో భారత విజయానికి 3 పరుగులు
19వ ఓవర్ చివరి బంతికి మిథాలీ ఫోర్ కొట్టడంతో ఆఖరి ఓవర్లో భారత విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి. నాన్స్ట్రయికింగ్ ఎండ్లో భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (32 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) ఉన్నప్పటికీ ఆమెకు ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం.

తొలి మూడు బంతులు వృథా
స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న భారత బ్యాట్స్ ఉమెన్ భారతి ఫుల్మాలి (5) ఇంగ్లండ్ బౌలర్ కేట్ క్రాస్ వేసిన ఈ ఓవర్లో తొలి మూడు బంతులను వృథా చేసింది. నాలుగో బంతికి భారీ షాట్కు యత్నించి నాలుగో బంతికి ఔటైంది. భారతి స్థానంలో వచ్చిన అనూజా పాటిల్ (0) సింగిల్ తీసి మిథాలీ రాజ్కు స్ట్రయికింగ్ ఇవ్వాలని ఆలోచించలేదు. భారీ షాట్ ఆడేందుకు క్రీజ్ వదిలి ముందుకొచ్చిన అనూజాను ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఆమీ ఎలెన్ జోన్స్ స్టంపౌంట్ చేసింది.

బంతికి మూడు పరుగులుగా
దాంతో భారత్ విజయ సమీకరణం ఒక బంతికి మూడు పరుగులుగా మారింది. చివరి బంతిని ఎదుర్కొనేందుకు క్రీజ్లోకి వచ్చిన శిఖా పాండే ఒక పరుగు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో స్మృతీ మంధాన(58; 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించింది.

ఇంగ్లాండ్ బౌలింగ్ అద్భుతం
13వ ఓవర్ చివరి బంతికి స్మృతి ఔటయ్యే సమయానికి భారత స్కోరు 87. అప్పటికి భారత్ నెగ్గాలంటే 42 బంతుల్లో 33 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ సమయంలో మిథాలీ రాజ్(30 నాటౌట్; 32 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ విజయం సాధిస్తుందనే అనుకున్నరంతా. అయితే ఇంగ్లాండ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది.

20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసిన ఇంగ్లాండ్
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసింది. డానియెలా వ్యాట్ (22 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), టామీ బీమోంట్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), ఆమీ జోన్స్ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హర్లీన్ డియోల్, అనూజా పాటిల్ రెండేసి వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications












