భారత మహిళా జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను చేజార్చుకుంది. వాంఖడే వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో చిత్తుగా ఓడింది. మరోసారి తడ'బ్యాటు'తో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ తో జరిగిన చివరి ఆరు టీ20 మ్యాచ్ ల్లో టీమిండియాకు ఇది అయిదో ఓటమి.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే హిట్టర్ షెఫాలీ వర్మ డకౌట్ గా వెనుదిరిగింది. వన్ డౌన్ లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (20) తో కలిసి స్మృతి మంధాన (10) రెండో వికెట్ కు 17 పరుగులు జోడించి ఔటైంది. భారత్ కు ఈ మ్యాచ్ లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం.

ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్ల తీస్తూ టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో 16.2 ఓవర్లలోనే హర్మన్ ప్రీత్ సేన 80 పరుగులకే ఆలౌటైంది. రోడ్రిగ్స్ టాప్ స్కోరర్ కాగా, భారత బ్యాటర్లలో స్మృతి, రోడ్రిగ్స్ మినహా ఎవరూ రెండంకెల స్కోరును అందుకోలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో డీన్, లారాన్ బెల్, సోఫీ ఎకిల్ స్టోన్, సారా గ్లెన్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన 11.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ అంత సునాయాసంగా గెలవలేదు. టీమిండియా బౌలర్లు వికెట్లతో సత్తాచాటి ఇంగ్లాండ్ ను కాసేపు ఒత్తిడిలోకి నెట్టారు. కానీ టార్గెట్ పెద్దగా లేకపోవడంతో భారత్ ఓటమిపాలైంది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో క్యాప్సీ (25), నాట్ సివర్ (16) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రేణుక సింగ్ , దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు, సైకా, పూజ తలో ఒక వికెట్ తీశారు. వాంఖడే వేదికగానే ఇవాళ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ జరగనుంది.