
అబుధాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో పాకిస్తాన్, న్యూజిల్యాండ్ లాంటి పటిష్ట జట్లపై ఓడిపోయిన టీమిండియా.. ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. అబుధాబి వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచులో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ నిరీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ మొహ్మద్ నబీ (35; 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇన్నింగ్స్ చివరలో కరీమ్ జనత్ (42; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. లాభం లేకుండా పోయింది. భారత బౌలర్లలో మొహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
షమీ, అశ్విన్ దెబ్బ:
భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ జట్టును భారత పేసర్లు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు ఆదిలోనే దెబ్బతీశారు. వరుస బంతుల్లో మొహమ్మద్ షెహజాద్ (0), హజ్రతుల్లా జజాయ్ (13)ను పెవిలియన్ చేర్చారు. అనంతరం రవీంద్ర జడేజా బౌలింగ్లో ధాటిగా ఆడుతున్న రహ్మానుల్లా గుర్బాజ్ (19) కూడా అవుటయ్యాడు. దాంతో నబీ సేన కష్టాల్లో పడింది. అనంతరం ఆర్ అశ్విన్ (2/14) ఆఫ్ఘన్ మిడిలార్డర్ను దెబ్బతీశాడు. యాష్ దెబ్బకు గుల్బాదిన్ నైబ్ (18), నజిబుల్లా జద్రన్ (11) పెవిలియన్ చేరారు. ఇక 19వ ఓవర్లో షమీ మరోసారి విజృంభించాడు. ఆఫ్ఘన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (35), రషీద్ ఖాన్ (0)ను అవుట్ చేశాడు. దాంతో ఏ దశలోనూ ఆఫ్ఘనిస్థాన్కు గెలుపు అవకాశాలు కనిపించలేదు. చివరకు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 144 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో షమీ 3, అశ్విన్ 2 వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది.
చెలరేగిన రోహిత్, రాహుల్:
అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పోటీపడి మరి బౌండరీలు బాదారు. షరాఫుద్దీన్ వేసిన రెండో ఓవర్లో కేఎల్ రాహుల్ ఫోర్, సిక్స్ బాదగా.. నవీన్ ఉల్ హక్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు ఓవర్లో భారత స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. తర్వాత ఓపెనర్లు ఇద్దరూ ధాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు భారత్ స్కోరు 85/0 వద్ద నిలిచింది. ఈ క్రమంలోనే రోహిత్, రాహుల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
రెచ్చిపోయిన పంత్, హార్దిక్:
అయితే రషీద్ ఖాన్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్స్లు బాదిన రోహిత్ శర్మ.. తర్వాతి ఓవర్లోనే మొహ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడారు. వచ్చిరావడంతోనే బౌండరీల మోతమోగించారు. గుల్బాదీన్ వేసిన 17వ ఓవర్లో పంత్ రెండు సిక్సర్లు కొట్టాడు. 18వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన హార్ది్క్.. 19వ ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక 20వ ఓవర్లో పంత్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
బ్యాటింగ్కు రాని కోహ్లీ:
ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు బ్యాటింగ్ చేయడానికి రాకపోవడం గమనార్హం. 15వ ఓవర్లో రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత హార్డ్ హిట్టర్ల అవసరం ఉందని గ్రహించిన టీమిండియా.. రిషబ్ పంత్ను రంగంలోకి దింపింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యాను బరిలో దింపారు. దీంతో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే ఈ వ్యూహం ఫలించిందనే చెప్పాలి. పంత్, హార్దిక్ ఇద్దరూ భారీ షాట్లు ఆడి టీమిండియాకు భారీ స్కోర్ అందించారు.