బెంగళూర్: భారత్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లోనూ కంగారూలకు దిమ్మ తిరిగే దెబ్బ తగిలింది. మొదటి టెస్టులో మాదిరిగానే ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ ఓటమి పాలైంది. ఐదో రోజు బుధవారం రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. పూజారా, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ భారత్ కు ఆస్ట్రేలియాపై సునాయస విజయాన్ని అందించారు. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ అత్యంత అలవోకగా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 2-0 స్కోర్ తో కైవసం చేసుకుంది. తద్వారా భారత్ టెస్టుల్లో తన ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. పూజారా అత్యంత అద్భుతంగా ఆడి 72 పరుగులు చేశారు. తొలి రెండు వికెట్లు త్వరగానే కోల్పోయిన పూజారా, సచిన్ నిలకడగా ఆడి భారత్ స్కోర్ ను పెంచారు. ఓపెనర్లు సెహ్వాగ్ 7 పరుగులకు, మురళీ విజయ్ 37 పరుగులు చేశారు. బెంగళూర్ లో 15 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ లో భారత్ కు విజయం లభించింది. సొంత గడ్డపై ఇది ఆస్ట్రేలియాపై 15వ విజయం. ఈ టెస్టు సిరీస్ ను కోల్పోవడంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ర్యాంకింగ్ లో ఐదో స్థానానికి పడిపోయింది. తొలి ఇన్నింగ్సులో డబుల్ సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్ విన్నింగ్ షాట్ కొట్టాడు. సచిన్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్సులో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ద్రావిడ్ 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ హిల్ఫన్ హాస్, నాథన్ హారిట్జ్, షేన్ వాట్సన్ ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 478, రెండో ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 495 పరగులు చేసింది. ఈ సిరీస్ లో సచిన్ టెండూల్కర్ అసమాన ప్రతిభ కనబరిచాడు. తొలి టెస్టులో వివియస్ లక్ష్మణ్ విజయాన్ని సాధించి పెట్టాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు లక్ష్మణ్ దూరమయ్యాడు. లక్ష్మణ్ స్థానంలో వచ్చిన పూజారా తనకు అప్పగించిన పని బాధ్యతాయుతంగా, ప్రతిభావంతంగా నెరవేర్చింది.