కాన్పూర్: ఇంగ్లాండుతో జరుగుతున్న ఏడు వన్డేల సరీస్ లో వరుసగా మూడో మ్యాచులోనూ భారత్ గురువారం విజయం సాధించింది. ఇంగ్లాండు నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన భారత్ మూడో వన్డేలో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ విజయం సాధించింది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట ఆగిపోయింది. ఆ సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 40 ఓవర్లలో 198 పరుగులు చేసింది. మరో 9 ఓవర్లు మిగిలి ఉండగానే ఆట ముగిసింది. యువరాజ్ సింగ్ ఈ మ్యాచులో 38 పరుగులకే ఆవుటయ్యాడు. గంభీర్, రైనాలు చాలా తొందరగా అవుటైనప్పటికీ సెహ్వాగ్ తో కలిసి రోహిత్ శర్మ భారత్ ను ఆదుకున్నాడు. సెహ్వాగ్ 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 28 పరుగులు చేశాడు. గంభీర్ 14, రైనా ఒక పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి ధోనీ 29 పరుగులతోనూ, యూసుఫ్ పఠాన్ 12 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నాడు. ఈ మ్యాచులో ఇంగ్లాండు ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్ రాణించాడు. ఫ్లింటాఫ్ మూడు వికెట్లు తీశాడు. స్వాన్, బ్రాడ్ లకు చెరో వికెట్ లభించాయి. 16 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లు ప్రకటించారు. కాన్పూర్ లో గురువారం జరిగిన మూడో వన్డేలో భారత బౌలర్ల ధాటికి నిలబడలేని ఇంగ్లాండ్ జట్టు 48.4 ఓవర్లలో 240 పరుగులు చేసి, ఆలౌటైంది. తొలి రెండు వన్డేలతో పోల్చితే ఇది వారికి అత్యధిక స్కోరు అయినప్పటికీ భారత్ ప్రస్తుత ఫాంను బట్టి చూస్తే భారీ లక్ష్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి కూడా భారత బౌలర్లు ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయడం గమనార్హం. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు రవి బొపారా (60), ఇయాన్ బెల్ (46)లతో పాటు ఫ్లింటాఫ్ (26), షా (40), సమిత్ పటేల్ (26)లు రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రద స్కోరును సాధించగలిగింది. భారత బౌలర్లలో హర్భజన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇశాంత్ శర్మ, మునాఫ్ పటేల్ లు రెండు చొప్పున, యువరాజ్, యూసుఫ్ పఠాన్, జహీర్ ఖాన్ లు చెరో వికెట్ పడగొట్టారు. షా వికెట్ ద్వారా హర్భజన్ వన్డేలలో 200వ వికెట్ దక్కించుకున్నట్లయింది. మంచు కారణంగా మ్యాచ్ ముప్పావు గంట ఆలస్యంగా ప్రారంభం అయింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు అంపైర్లు కుదిరంచారు. ఈ కారణంగా పవర్ ప్లే కోసం బ్యాటింగ్ జట్టు ఎంచుకునే ఓవర్ల సంఖ్యను ఐదు నుంచి నాలుగుకు కుదించారు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో ఒక్కో మార్పు చేశారు. పేస్ బౌలర్ హార్మిసన్ స్థానంలో స్పిన్నర్ స్వాన్ ను ఇంగ్లాండ్ బరిలో దింపింది. భారత జట్టులో తొలి రెండు వన్డేలలో అంతగా రాణించని ఆర్పీసింగ్ బదులు ఆస్ట్రేలియాతో సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన ఇశాంత్ శర్మ చేరాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడం ద్వారా భారత్ ఏడు వన్డేల సిరీస్ లో 2-0 ఆధిక్యంతో నిలిచిన సంగతి తెలిసిందే.