

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తుంటే జట్టును అత్యుత్తమంగా రూపొందించేందుకు నిరంతరం శ్రమించే పనిలోనే ఉన్నాడని అనిపిస్తోందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. సుదీర్ఘ సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
తాజాగా 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే చాట్ షోలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేన గురించి మాట్లాడాడు. "మనం ఎక్కడ ఉన్నా సరే.. క్రీజులో కోహ్లీ ఉన్నాడని తెలిస్తే.. చాలు, వెంటనే వచ్చి అతని ఆటను చూస్తాం. అతని ఆటను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాం. ఆ స్థాయిలో ఆటపై కోహ్లీ ప్రభావం ఉంటుంది" అని అన్నాడు.
"ఒక్కోసారి అతణ్ని చూస్తుంటే, జట్టును అత్యుత్తమంగా రూపొందించేందుకు నిరంతరం శ్రమించే పనిలోనే ఉంటాడు" అని కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. యావత్ దేశం మొత్తం కోహ్లీని నమ్ముతుందని గంగూలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా యో-యో టెస్టుపై కూడా గంగూలీ స్పందించాడు.
"క్రికెట్ అంటేనే ఫిట్నెస్కు సంబంధించిన క్రీడ. అలాంటి ఆటలో రాణించాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. కానీ ఈ ఫిట్నెస్ పరీక్షపై చాలా మంది విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఓ ఆటగాడి సామర్థ్యాన్ని నిర్ణయించడానికి దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి" అని గంగూలీ తెలిపాడు.
ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది. అయితే, టెస్టు సిరీస్ గెలవడం మాత్రం బ్యాట్స్మెన్ ప్రదర్శన పైనే ఆధారపడి ఉందని గంగూలీ చెప్పాడు. టెస్టు క్రికెట్లో తొలి ఇన్నింగ్స్లో ఎవరైతే 400 పరుగులు సాధిస్తారో.. వారికే విజయావకాశాలుంటాయని అన్నాడు.
ప్రస్తుతం కోహ్లీసేన సమతూకంగా ఉందని, బ్యాట్తో చక్కగా రాణిస్తే తప్పకుండా ఇంగ్లాండ్పై విజయం సాధిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్పై సిరీస్ గెలవడానికి భారత్కు ఎక్కువగా అవకాశాలున్నాయని గంగూలీ వెల్లడించాడు.