
సిడ్నీ: మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పరుగుల సునామీని సృష్టించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడిక సిడ్నీకి చేరింది. కొద్దిసేపటి కిందటే జట్టు మొత్తం సిడ్నీలో ల్యాండ్ అయింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇలా జట్టు మొత్తం ప్రత్యేక విమానంలో మెల్బోర్న్ నుంచి బయలుదేరింది. సిడ్నీలో అడుగు పెట్టింది. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్లో భాగంగా తన తదుపరి మ్యాచ్ను భారత్ ఇక్కడే ఆడబోతోంది.
సూపర్ 12లో భాగంగా మెల్బోర్న్లో టీమిండియా తన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను మట్టి కరిపించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. టీమిండియా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 20వ ఓవర్ చివరిబంతికి విన్నింగ్ షాట్ పడింది. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ ఏ రకంగా విజయతీరాలకు చేర్చాడనేది చూశాం. కాలం గడుస్తున్నా దీనికి సంబంధించిన ప్రకంపనలు తగ్గట్లేదు.
పాకిస్తాన్పై సాధించిన విజయంతో తన తదుపరి మ్యాచ్ కోసం సమాయాత్తమౌతోంది రోహిత్ సేన. సూపర్ 12లో తన నెక్స్ట్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఎదుర్కొనబోతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్.. దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నెల 27వ తేదీన గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. సిడ్నీలో ల్యాండ్ అయ్యామంటూ టీమిండియా ప్లేయర్లు తమ ఇన్స్టాగ్రామ్లల్లో పోస్ట్ చేశారు. కొన్ని ఫొటోలను వాటికి జత చేశారు.
ఈ రోజున మొత్తంగా మూడు మ్యాచ్లు జరుగనున్నాయి.. టీ20 ప్రపంచకప్లో. దక్షిణాఫ్రికా జట్టు బంగ్లాదేశ్ను అదే రోజున ఎదుర్కొంటుంది. అలాగే- పాకిస్తాన్.. జింబాబ్వేతో తలపడుతుంది. లీగ్ దశను దాటుకుని సూపర్ 12లో అడుగు పెట్టింది నెదర్లాండ్స్. ఇవ్వాళే తన తొలి మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్ను ఎదుర్కొంది. ఫలితం మాత్రం నెదర్లాండ్స్కు అనుకూలంగా రాలేదు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిందా జట్టు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా- మొత్తం 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. 38 పరుగులతో మిడిలార్డర్ బ్యాటర్ హఫీఫ్ హొస్సైన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 25, మొసాడ్డెక్ హొస్సైన్ 20 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ లక్ష్యాన్ని అందుకోలేకోయింది. 20 ఓవర్లల్లో 135 పరుగులకు ఆలౌట్ అయింది.
టాప్ ఆర్డర్ బ్యాటర్ కొలిన్ అక్కెర్మన్ ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు గానీ విజయం సాధించడానికి అది సరిపోలేదు. 48 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు కొలిన్. పాల్ వాన్ మీకెరెన్-24, కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 16 మినహా మరెవరూ డబుల్ డిజిట్ స్కోర్ సాధించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్ తస్కీన్ అహ్మద్ ఈ మ్యాచ్లో హీరో. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చిన తస్కీన్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు.