న్యూఢిల్లీ : ధర్మశాలలో పేస్ బౌలింగుకు అనుకూలించే పిచ్ను చూస్తే భారత జట్టు వణికిపోతుందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ అన్నాడు. నాలుగో టెస్టు మ్యాచుకు వేదిక అయిన ధర్మశాల పిచ్పై ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచుల్లో ఇరు జట్లు చెరొకటి గెలుచుకోగా, మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయింది. ధర్మశాల అద్భుతమైన మైదానమని, చాలా తక్కువ సార్లు మాత్రమే గడ్డి కనిపిస్తుందని ఆయన అన్నాడు. అందువల్ల ఆస్ట్రేలియన్లు గట్టి విశ్వాసంతో ఉన్నారని, టీమిండియా మాత్రం వణుకుతోందని అన్నాడు.
ఈ సిరీస్లో వాళ్లు అతి విశ్వాసంతో ఉన్నట్లున్నారని, వాళ్ల స్కోర్ లైన్ దాన్ని చూపిస్తోందని అన్నాడు. జాక్సన్ బర్డ్కు బదులు ఇలాంటి పిచ్ మీద పూణే టెస్టు హీరో స్టీవ్ ఓకీఫ్ను తీసుకుని వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. నాలుగో టెస్టు మ్యాచు శనివారం ధర్మశాలలో ప్రారంభం కానుంది.
ఈ సిరీస్లో స్పిన్నర్లు మంచి ఆట తీరు ప్రదర్శించారని, ఇంతకు ముందు వాళ్లను జట్టులో ఉంచుతారా లేదా అనే పరిస్థితి ఉందని, ఇప్పుడు తమ ప్రదర్శనతో ఎలాంటి పిచ్ల మీదనైనా ఫలితాలు సాధించగలమని నిరూపించారని అన్నాడు. నాథన్ లయన్కు ఈసారి మంచి బౌన్స్ లభిస్తుందని, అతడు బంతిని బాగా టర్న్ చేస్తున్నాడని జాన్సన్ అన్నాడు.
అయితే రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం కాస్తా జాగ్రత్త పడాల్సిందేనని చెప్పాడు. ధర్మశాల వంటి పిచ్ల మీద బర్డ్ బాగా ఉపయోగపడుతాడని చెప్పాడు.