
హైదరాబాద్: అఫ్ఘాన్తో టీ 20 అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు మెరుగ్గా రాణిస్తుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్లో టీమిండియాకు ఇప్పటి వరకు మెరుగైన రికార్డులేకపోయినా.. రానున్న పర్యటనలో భారత్ ఆ జట్టుకి గట్టి పోటీనిస్తుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
'ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు విజయాల్ని సాధిస్తుందని చాలా నమ్మకంగా ఉంది. దక్షిణాఫ్రికాతో వన్డేల్లో టీమిండియా చెలాయించిన ఆధిపత్యం ఇక్కడా కొనసాగిస్తే చాలు. కచ్చితంగా ఇంగ్లాండ్ జట్టుని ఓడించొచ్చు. మ్యాచ్లు ఎక్కడ జరుగుతున్నా.. భారత జట్టే ఫేవరెట్' అని గంగూలీ వెల్లడించాడు.
ఇక కోహ్లి సేన ఇంగ్లండ్ పర్యటనలో జూలై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్ట్లు ఆడనుంది. ఇటీవల పాక్తో ఇంగ్లండ్ తొలి టెస్ట్లో 9 వికెట్లతో ఓడి తరువాత సిరీస్ సమం చేసిన విషయం తెలిసిందే. 'పాకిస్తానే గెలిచింది.. అలాంటప్పుడు భారత్ సులువుగా సీరీస్ గెలుస్తోంది. పాక్ కన్నా భారత్కు చాలా అవకాశాలున్నాయి.' అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ గడ్డపై చివరి పర్యటనలో భారత్ 1-3 తేడాతో టెస్టు సిరీస్ని చేజార్చుకుంది.
పేస్ బౌలర్లకి విపరీతంగా అనుకూలించే ఆ పిచ్లపై విదేశీ బ్యాట్స్మెన్ తడబడతారనే అపవాదు ఉంది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో ముగిసిన సుదీర్ఘ సిరీస్లో భారత్ జట్టు అద్వితీయ ప్రదర్శన ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలోనూ అసాధారణ ఆటతీరుతో జట్టుకి విజయాల్ని అందించాడు.